Vande Bharat News: భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని మార్చేసింది వందేభారత్ ఎక్స్ ప్రెస్. అత్యాధునిక సౌకర్యాలు, అదిరిపోయే వేగంతో పట్టాలెక్కింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 136 వందేభారత్ రైళ్లు ప్రయాణీకులకు సేవలను అందిస్తున్నాయి. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన ఈ సెమీ హైస్పీడ్ రైలు వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. సాధారణ రైళ్లతో పోల్చితే ప్రపంచ స్థాయి ఫీచర్లు ఉండటంతో ప్రయాణీకులు ఈ రైళ్లలో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఈ రైళ్లు నడిచే అన్ని మార్గాల్లోనూ పూర్తి స్థాయి ఆక్యుపెన్సీతో పరుగులు తీస్తున్నాయి. టికెట్ ధర ఎక్కువ అయినప్పటికీ అతివేగంగా, ఆహ్లాదకరంగా ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో వందేభారత్ లోనే వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు.
సిగరెట్ పొగతో ప్రయాణీకుల అవస్థలు
ఇక తాజాగా విశాఖపట్నం- సికింద్రాబాద్ వందేభారత్ రైల్లో ప్రయాణీకులకు విచిత్రమైన పరిస్థితి ఎదురయ్యింది. ఒక బోగీలో సిగరెట్ పొగ దట్టంగా వ్యాపించడంతో ప్యాసింజర్లు షాక్ అయ్యారు. సిగరెట్ పొగ పీల్చలేక అవస్థలు పడ్డారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. వందేభారత్ రైల్లోని టాయిలెట్ లో ఓ ప్రయాణీకులు సిగరెట్ తాగాడు. కొద్ది క్షణాల్లోనే ఆ పొగ మొత్తం కోచ్ లో అలుముకుంది. ఘాటు పొగ పీల్చుకోలేక ప్రయాణీకులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మహిళలు, వృద్ధులు మరింత అవస్థలు పడ్డారు. వెంటనే, సదరు కోచ్ లోని ప్రయాణీకులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు.
ప్రయాణీకులను సముదాయించిన టీసీ
విషయం తెలియడంతో వెంటనే టీసీ సదరు బోగీలోకి వచ్చారు. కోచ్ లో కమ్ముకున్నది సిగరెట్ పొగగా గుర్తించారు. అయితే, సిగరెట్ ఎవరు తాగింది గుర్తు పట్టడం కష్టం అన్నారు. తాను కూడా సిగరెట్ పొగతో ఇబ్బంది పడినట్లు చెప్పారు. మరికొంత మంది ప్రయాణీకులు కాసేపు కోచ్ డోర్లు ఓపెన్ చేయాలని కోరారు. కానీ, కాసేపట్లోనే పరిస్థితి సర్దుమణుగుతుందని ప్రయాణీకులకు సర్ది చెప్పారు. ప్రయాణీకులను శాంతపరిచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, రైల్లో సిగరెట్లు కాల్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ హైదరాబాద్ వందే భారత్ రైలు టాయిలెట్ లో సిగరెట్ త్రాగిన వ్యక్తి, బోగీలో పొగలు.
టిక్కెట్ కండక్టర్ ను నిలదీసిన ప్రయాణికులు. నేనేమి చేస్తాను అంటూ టీసి ఎదురు ప్రశ్న! #Smoking #VandeBharat #Vizag #Hyderabad #Railways #AndhraPradesh #UANow #Visakhapatnam #Secunderabad pic.twitter.com/qJm9pnHVzO
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) February 10, 2025
Read Also: గుడ్ న్యూస్.. ఇక ఆ స్టేషన్లోనూ ఆగనున్న సికింద్రాబాద్ – విశాఖ వందే భారత్ రైలు!
వందేభారత్ లో భద్రతపై ప్రయాణీకులు ఆందోళ
అత్యాధునికి వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో సిగరెట్ కాల్చడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. భద్రతకు పెద్దపీట వేసే అత్యాధునిక రైళ్లోకి అగ్గి పెట్టెలు, సిగరెట్లు ఎలా వచ్చాయి అని ప్రశ్నిస్తున్నారు. సికింద్రాబాద్- విశాఖ వందేభారత్ ఎక్స్ ప్రెస్ నిజానికి 100 శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతుంది. ఇంత ఆదరణ ఉండే రైళ్లోకి అగ్గిపెట్టెలు తెస్తుంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్నాలు తలెత్తుతున్నాయి. అటు ఈ ఘటనపై రైల్వేశాఖ ఉన్నతాధికారులు సైతం ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. ఇకపై వందేభారత్ రైల్లోకి ఎక్కే ప్రతి ప్రయాణీకుడిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Read Also: గుడ్ న్యూస్, తెలుగు రాష్ట్రాలకూ ఓ వందేభారత్ స్లీపర్.. ఏ రూట్లో నడుస్తుందంటే?