Vande Bharat Through Sambhar Salt Lake: రాజస్థాన్లోని సాంబార్ సరస్సు పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది కంటిచూపు మేరలో కనిపించే ఉప్పు నేలలు. ఇప్పుడు అదే తెల్లటి ఉప్పు తివాచీ మధ్యలో దూసుకెళ్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ దృశ్యం సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రకృతి అందాలు, అత్యాధునిక రైల్వే టెక్నాలజీ ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో ఈ వీడియో నెటిజన్లను అలరిస్తోంది.
దేశంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా పేరున్న సాంబార్ సరస్సు చుట్టూ కొన్ని ప్రాంతాల్లో వేసవి, ఎండాకాలంలో నీరు తగ్గినప్పుడు తెల్లటి ఉప్పు పొరలు విస్తారంగా కనిపిస్తాయి. అలాంటి ప్రాంతం మీదుగా వందే భారత్ రైలు వెళ్తున్న దృశ్యం పై నుంచి చూస్తే మరింత అద్భుతంగా కనిపిస్తుంది. తెల్లటి నేల మధ్య కేసరి, ఆరెంజ్ రంగులతో కనిపించే రైలు వేగంగా ముందుకు సాగడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. దూరం నుంచి చూస్తే విశాలమైన తెల్లటి మైదానంపై ఒక పొడవాటి రంగుల గీత కదులుతున్నట్టుగా అనిపిస్తుంది.
ఢిల్లీ కాంట్ నుంచి జోధ్పూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్, జైపూర్–ఫూలేరా–సాంబార్ మార్గం మీదుగా ప్రయాణించే సమయంలో ఈ అందమైన దృశ్యాలు ప్రయాణికులకు కనిపిస్తాయి. సాధారణంగా రైలు ప్రయాణం అంటే కిటికీ బయట కనిపించే పొలాలు, గ్రామాలు, కొండలు గుర్తుకొస్తాయి. కానీ, సాంబార్ ప్రాంతంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఒకవైపు ఆకాశాన్ని తాకేలా కనిపించే విశాలమైన ఉప్పు నేలలు.. మరోవైపు వాటి మధ్య నుంచి వేగంగా దూసుకెళ్లే అత్యాధునిక రైలు.. వావ్ అనిపిస్తోంది.
సాంబార్ సరస్సుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. చలికాలంలో ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది వలస పక్షులు తరలివస్తాయి. ముఖ్యంగా ఫ్లెమింగోలు సహా అనేక రకాల పక్షులు ఈ ప్రాంతంలో సందడి చేస్తాయి. నీటి విస్తీర్ణం, ఉప్పు నేలలు, వలస పక్షులతో సాంబార్ సరస్సు శీతాకాలంలో మరింత అందంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణం సాగుతున్న దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను కూడా ఆకట్టుకుంటున్నాయి.
జైపూర్కు చెందిన ఫొటోగ్రాఫర్ యోగేష్ సేవ్కానీ డ్రోన్ కెమెరాతో ఈ విజువల్స్ షూట్ చేశారు. నేలపై నుంచి చూస్తే సాధారణంగా కనిపించే రైలు ప్రయాణం.. గాల్లో నుంచి చిత్రీకరించినప్పుడు పూర్తిగా భిన్నంగా కనిపించింది. విశాలమైన ఉప్పు మైదానాన్ని దాటుతూ వందే భారత్ ముందుకు సాగుతున్న తీరు ఆకట్టుకుంటుంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. సాంబార్ సరస్సు సహజ అందాలకు వందే భారత్ ఆధునికత తోడవడంతో.. రాజస్థాన్లో రైలు ప్రయాణం ఎంత ప్రత్యేకంగా ఉంటుందో చాటి చెప్తోంది.
Vande Bharat Express cutting through India's largest salt water lake i.e. Sambhar Lake in Rajasthan ✨ pic.twitter.com/yL7vnM6ufp
— Trains of India 🇮🇳 (@trainwalebhaiya) September 7, 2026
Read Also: 11 రాష్ట్రాలు.. 4,000 కిలో మీటర్లు.. దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇదే!