Chiranjeevi: కాలం కలిసిరావడమంటే ఇదేనేమో. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మరో పదవి వచ్చింది. ఈసారి చిరు కూతురు సుస్మితకు బంపరాఫర్ వచ్చింది. విజయవాడ దుర్గగుడిలో పదవి దక్కించుకున్నారు. ఇంతకీ ఆ పదవి విషయాలను ఒక్కసారి చూద్దాం.
నటుడు చిరంజీవి కూతురు సుస్మిత విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తర్వాత కొణిదెల సుస్మిత.. ఆలయ అభివృద్ధి, పరిపాలనకు సంబంధించిన వివిధ కార్యకలాపాలకు తనవంతు సహకారం అందించనున్నారు.
ఆలయానికి వచ్చే భక్తుల కోసం సౌకర్యాలను మెరుగుపరచడం, వివిధ ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంలో సూచనలు, సహకారం అందించనున్నారు. మరోవైపు నటుడు చిరంజీవి భార్య సురేఖ తెలంగాణలోని యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలిగా నియమితులైన విషయం తెల్సిందే.
అంతకుముందు నాగబాబుకు ఏపీ ప్రభుత్వంలో పదవి దక్కింది. ఏపీ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రీచ్మెంట్-ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్గా ఆయన నియమితులయ్యారు. ఆయన కు క్యాబినెట్ హోదా కల్పించింది ప్రభుత్వం.
2047 నాటికి ఏపీ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ-వృక్ష విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచాలన్నది ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ కోసం ఏపీ గ్రీన్ సొసైటీకి కార్యనిర్వాహక కమిటీ, జిల్లాస్థాయి అభివృద్ధి సంస్థల పాలక మండళ్లను ఏర్పాటు చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ ఫ్యామిలీకి పదవులు దక్కడంపై అభిమానులు ఫుల్ఖుషీగా ఉన్నారు.
ALSO READ: పార్టీ కేడర్కు టీడీపీ-జనసేన పార్టీలు వార్నింగ్.. రిపీట్ చేస్తే ఊరుకునేది లేదు