Bengaluru-Mumbai Vande Bharat Sleeper: బెంగళూరు-ముంబై నగరాల మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు ముఖ్య నగరాలను కలుపుతూ వందే భారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్కు లేఖ ద్వారా తెలియజేశారు. ఆ లేఖను పీసీ మోహన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇప్పటికే వందే భారత్ రైళ్లు దేశంలోని పలు మార్గాల్లో నడుస్తున్నాయి. కానీ, బెంగళూరు–ముంబై మార్గంలో ఇప్పటి వరకు ఇలాంటి ప్రీమియం సర్వీస్ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో స్లీపర్ వెర్షన్ లో వందే భారత్ రైలు రావడం ప్రయాణికులకు పెద్ద ఊరట కానుంది. ముఖ్యంగా ఈ రెండు నగరాలు ఐటీ, ఆర్థిక రంగాల్లో ఎంతో ప్రాధాన్యం కలిగి ఉండటంతో, వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి ఉపయోగపడనుంది.
ఈ రైలుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. రైలు ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏ మార్గంలో నడుస్తుంది? ఎన్ని స్టేషన్లలో ఆగుతుంది? లాంటి విషయాలపై రైల్వే శాఖ త్వరలో స్పష్టత ఇవ్వనుంది. ఈ నిర్ణయంపై ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణ సమయం 16 గంటలకు తగ్గడం వల్ల చాలా సౌకర్యవంతంగా ఉంటుందంటున్నారు.
మరికొంత మంది ప్రయాణీకులు టైమ్ టేబుల్ను కూడా ప్రతిపాదించారు. ముంబై నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరే రైలు, రాత్రి 8 గంటలకు పూణే చేరుకుని, తర్వాతి రోజు ఉదయం 9 గంటలకు బెంగళూరు చేరుకోవాలి. అలాగే తిరుగు ప్రయాణంలో బెంగళూరు నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి, ఉదయం 6 గంటలకు పూణే, ఉదయం 9 గంటలకు ముంబై చేరేలా షెడ్యూల్ ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య నేరుగా నడిచే ప్రధాన రైలు ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ మాత్రమే ఉంది. ఇది సుమారు 1,134 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ, దాదాపు 22 గంటల సమయం తీసుకుంటుంది. మధ్యలో 30కి పైగా స్టేషన్లలో ఆగుతుంది. దీంతో ప్రయాణం కొంత ఎక్కువ సమయం పడుతుంది. రోడ్డు మార్గంలో కూడా బెంగళూరు నుంచి ముంబై వరకు దాదాపు 984 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ట్రాఫిక్ పరిస్థితులను బట్టి ఈ ప్రయాణం 15 నుంచి 17 గంటల వరకు పడుతుంది. అయితే, రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండటంతో చాలా మంది దానినే ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశం మరింత అనుకూలంగా మారనుంది. ప్రయాణ వేగాన్ని పెంచడమే కాకుండా, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించే అవకాశం ఉంది.
Read Also: ఇండియన్ రైల్వేలోకి కొత్త రైళ్లు, స్పీడ్ ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!