Railway Station Board: సాధారణంగా ప్రతీ రైల్వేస్టేషన్ లో పసుపు రంగు బోర్డులు దర్శనమిస్తుంటాయి. ఆ బోర్డుపై స్టేషన్ పేరు ఇంగ్లీష్, హిందీ, స్థానిక భాషల్లో రాసి ఉంటుంది. అయితే అదే బోర్డు కింద చిన్న అక్షరాలతో ‘సముద్ర మట్టం నుండి ఎత్తు’ (Height Above Sea Level / MSL) అని రాసి ఉండటం కూడా గమనించే ఉంటారు. చాలామంది ఇది కేవలం ఏదో సమాచారం కోసం రాశారని అనుకుంటారు. కానీ దీని వెనుక ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. అదేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
భూమ్మీద ప్రతీ ప్రాంతం ఒకే విధంగా ఉండదు. ఒకచోట కొండలు, మరోచోట లోయలు ఉండటాన్ని మనం చూస్తూనే ఉంటాం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఒక ప్రాంతం ఖచ్చితమైన ఎత్తును కొలవడానికి ‘సముద్ర మట్టాన్ని’ (Mean Sea Level) ప్రామాణికంగా తీసుకుంటారు. ఎందుకంటే సముద్రపు నీటి మట్టం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒకేలా సమానంగా ఉంటుంది. దేశంలో దీని కోసం ముంబయి సముద్ర మట్టాన్ని బేస్గా తీసుకుని ఎత్తులను లెక్కిస్తారు.
ఇక రైల్వే బోర్డులో పొందుపరిచే సముద్రమట్టం ఎత్తు సమాచారం ప్రయాణికుల కోసం ఉద్దేశించింది కాదని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. రైలు నడిపే లోకో పైలెట్లు, గార్డుల కోసం బోర్డుపై ఈ సమాచారాన్ని రాస్తారని స్పష్టం చేస్తున్నాయి. రైలు ఒక స్టేషన్ నుండి మరో స్టేషన్కు వెళ్లేటప్పుడు ఆ తరువాతి స్టేషన్ సముద్ర మట్టం కంటే ఎంత ఎత్తులో ఉందో డ్రైవర్కు తప్పనిసరిగా తెలియాలి. ఉదాహరణకు ప్రస్తుత స్టేషన్ ఎత్తు 100 మీటర్లు ఉండి వచ్చే స్టేషన్ ఎత్తు 150 మీటర్లు అని బోర్డుపై ఉంటే.. రైలు ఎత్తు వైపు లేదా ఎత్తు పల్లం వైపు వెళ్తోందని డ్రైవర్ అర్థం చేసుకుంటారు.
రైలు ఎత్తు వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఇంజిన్కు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అప్పుడు లోకో పైలట్ ఇంజిన్ యాక్సిలరేషన్ను (వేగాన్ని) పెంచుతారు. దీనికోసం ఎంత విద్యుత్ లేదా ఇంధనం కావాలో ముందే అంచనా వేస్తారు. అదే విధంగా రైలు ఎత్తు నుండి కిందికి దిగుతున్నప్పుడు (డౌన్ గ్రేడియంట్) వేగాన్ని అదుపు చేయడానికి బ్రేకింగ్ సిస్టమ్ను సిద్ధం చేసుకుంటారు. తద్వారా రైలు వేగాన్ని నియంత్రించేందుకు ఈ సముద్ర మట్టం సమాచారం డ్రైవర్ కు ఉపయోగపడుతుంది.
Also Read: రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!
ఒకవేళ సముద్ర మట్టం ఎత్తు గురించిన వివరాలు లోకో పైలట్కు తెలియకపోతే ఒక్కసారిగా వచ్చే మలుపులు లేదా ఎత్తుల వద్ద రైలు వేగాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. ఇది రైలు పట్టాలు తప్పడానికి లేదా ప్రమాదాలకు దారితీయవచ్చని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. బోర్డులపై ఉండే ఈ చిన్న నంబర్ ఆధారంగానే డ్రైవర్లు రైలు వేగాన్ని చాకచక్యంగా నియంత్రిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారని స్పష్టం చేస్తున్నారు.
Also Read: IRCTCకి కాలం చెల్లిందా? కొత్త ‘RailOne’ యాప్ ప్రత్యేకతలు ఇవే!