Longest Train Journey In The World: ప్రపంచ రైల్వే వ్యవస్థలో బోలెడు ప్రత్యేకతలు ఉన్నాయి. అలాంటి ఓ స్పెషల్ ట్రైన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత దూరం ప్రయాణిస్తుంది. ఏకంగా 13 దేశాలను కలుపుతూ ప్రయాణిస్తుంది. ఈ ప్రత్యేక రైలు పోర్చుగల్లోని లాగోస్ నుంచి సింగపూర్ వరకు ప్రయాణిస్తుంది. సుమారు 18,755 కిలో మీటర్లు ఏక బిగిన జర్నీ చేస్తుంది. ఈ ప్రయాణం 21 రోజుల పాటు కొనసాగుతుంది. విభిన్న దేశాలు, విభిన్న సంస్కృతులు, వేష భాషలు కలిగిన జనాలు ఈ రైల్లో ప్రయాణిస్తారు.
ఈ రైలు ఏ దేశాల్లో ప్రయాణిస్తుందంటే?
ఈ రైలు ప్రయాణం పోర్చుగల్ లోని అత్యంత అందమైన లాగోస్ సిటీ నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, వియత్నాం, థాయ్లాండ్ మీదుగా సింగపూర్ కు చేరుకుంటుంది. ఈ రైలు పారిస్, మాస్కో, బీజింగ్, బ్యాంకాక్ లాంటి ముఖ్య నగరాలను కలుపుతూ వెళ్తుంది. ఇందులో 11 రూట్ స్టాప్లు ఉన్నాయి. ఈ ప్రయాణం ఒక్కసారి మొదలైతే మూడు వారాలపాటు కొనసాగుతుంది.
ఈ రైలు టికెట్ ధర ఎంత అంటే?
ఈ రైల్లో టికెట్ ధర సుమారు 1,350 డాలర్లు ఉంటుంది. అంటే భారత కరెన్సీలు దాదాపు రూ. 1,13,988. అమ్మో అనిపించినప్పటికీ విమాన చార్జీలతో పోల్చితే చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. ఈ ప్రయాణానికి సంబంధించి సరైన ప్లాన్ ముందుగానే రెడీ చేసుకోవాలి. ఎందుంటే, ప్రయాణీకులకు డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. బెర్త్ సెలెక్షన్ కు కూడా చాలా పోటీ ఉంటుంది.
పలు దేశాల రైల్వే సంస్థల సహకారం
ఈ రైలు ప్రయాణాన్ని ఏ ఒక్క దేశం ప్రత్యేకంగా నిర్వహించదు. పలు దేశాలు కలిపి సంయుక్తంగా నడిపిస్తాయి. లావోస్, చైనా మధ్య ఇటీవల ప్రారంభించబడిన రైల్వే లైను యూరప్, ఆసియాకు అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించింది. లావోస్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పోర్చుగల్ నుంచి సింగపూర్ ఎలాంటి ఇబ్బందులు లేని ప్రయాణాన్ని అందించడంలో ఈ లైన్ సాయపడుతున్నది.
లండన్-సింగపూర్ రూట్ రికార్డు బ్రేక్
గతంలో పోర్చుగల్ నుంచి సింగపూర్ వరకు రైలు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఒకే లైన్ ఉండేది కాదు. కానీ, చైనాలోని కున్మింగ్, లావోస్ రాజధాని వియంటియాన్ కు ఓ కొత్త రైల్వే మార్గాన్ని నిర్మించారు. ఈ లైన్ కు పోర్చుగల్-సింగపూర్ రూట్ ను లింక్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే లైన్ గా గుర్తింపు తెచ్చుకుంది. దీనికంటే ముందు, లండన్ నుంచి సింగపూర్ వరకు ఉన్న రైల్వే లైన్ అతిపెద్ద రైల్వే లైన్ గా కొనసాగేది. ఇప్పుడు ఆ రికార్డును కొత్త రైల్వే లైన్ బద్దలు కొట్టింది. ఎంతో మంది పర్యాటకులు ఈ రైలు ద్వారా ప్రపంచ యాత్ర చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రైలు పూర్తి స్థాయి ఆక్యుపెన్సీతో నడుస్తున్నది.
Read Also: టికెట్ లేకుండానే ఈ రైల్లో హాయిగా వెళ్లొచ్చు! ఈ స్పెషల్ ట్రైన్ మన దేశంలోనే ఉంది తెలుసా?