Sudha Chandran: ప్రముఖ నటి, నృత్యకారిణి సుధా చంద్రన్ (Sudha Chandran) అంటే తెలియనివారు వుండరు. అయితే, ఇటీవల ఆమె పంచుకున్న ఒక వింత అనుభవం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక టీవీ షో షూటింగ్ సమయంలో ఆమె ఒక రకమైన పారవశ్యంలోకి వెళ్లిపోయి, తనకు తెలియకుండానే భారీ మొత్తంలో నీటిని తాగేశారు. ఈ ఘటన వెనుక ఉన్న ఆధ్యాత్మిక కోణం ఏమిటి? ఆ సమయంలో ఆమె అనుభూతి ఎలా ఉంది? అన్న ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం..
సుధా చంద్రన్ తన కెరీర్లో ఎన్నో క్లిష్టమైన పాత్రలు పోషించారు, కానీ ‘మాతా కీ చౌకీ’ సీరియల్ షూటింగ్ సమయంలో జరిగిన ఘటన ఆమెను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ సీరియల్లో ఆమె ఒక భక్తురాలి పాత్రలో నటిస్తున్నప్పుడు, పూజలో భాగంగా నీటిని తాగే దృశ్యం ఉంది. అయితే, కెమెరా రోల్ అవుతున్నప్పుడు ఆమె పూర్తిగా చుట్టూ ఎవరు వున్నారు అన్నది మరిచిపోయి, ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్లిపోయారు. కేవలం 6 నిమిషాల వ్యవధిలోనే ఆమె ఏకంగా 4 లీటర్ల నీటిని తాగేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న యూనిట్ సభ్యులంతా ఆమెను చూసి విస్తుపోయారు. సాధారణంగా ఒక వ్యక్తి అంత తక్కువ సమయంలో అంత నీరు తాగడం అసాధ్యం, కానీ ఆ సమయంలో ఆమెలో ఏదో తెలియని శక్తి ప్రవేశించినట్లు అనిపించిందని ఆమె స్వయంగా వెల్లడించారు.
ఆ వింత అనుభవం గురించి సుధా చంద్రన్ మాట్లాడుతూ.. “నేను ఆ సమయంలో స్పృహలోనే లేను.. కేవలం ఆ పాత్రలో లీనమైపోయాను. ఆరు నిమిషాల పాటు నేనొక ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాను, దర్శకుడు ‘కట్’ చెప్పే వరకు కూడా నేను ఎంత నీరు తాగాను అన్న విషయం కూడా గమనించలేదు. షూటింగ్ పూర్తయిన తర్వాత నా చుట్టూ ఉన్నవారు షాక్లో ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. నా పొట్ట కూడా అసలు ఉబ్బినట్లు అనిపించలేదు” అంటూ ఆ వింతను గుర్తు చేసుకున్నారు. నటనలో లీనమైనప్పుడు లేదా భక్తి పారవశ్యంలో ఉన్నప్పుడు మనిషి శారీరక పరిమితులను దాటి ప్రవర్తిస్తారనడానికి ఈ ఘటన ఒక నిదర్శనంగా నిలిచింది.
ALSO READ:Surekha Vani: తల్లిని మళ్లీ పెళ్లి చేసుకోమన్న సుప్రీత.. సురేఖవాణి రియాక్షన్?
కళాకారులు పాత్రల్లో ఎంతగా పరకాయ ప్రవేశం చేస్తారో చెప్పడానికి సుధా చంద్రన్ అనుభవమే ఒక ఉదాహరణ. తన నటనను కేవలం వృత్తిలా కాకుండా ఒక తపస్సులా భావించడం వల్లే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదంలో కాలు కోల్పోయినా వెనకడుగు వేయకుండా కృత్రిమ కాలితో ప్రపంచ ప్రఖ్యాత నర్తకిగా ఎదిగిన ఆమె ధైర్యం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ తాజా ఘటన ద్వారా ఆమెలోని ఆధ్యాత్మిక కోణం మరియు వృత్తి పట్ల ఆమెకు ఉన్న అంకితభావం మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఏదేమైనా, ఒక నటిగా ఆమె ప్రయాణం ఎందరికో ఆదర్శం.