ప్రభుత్వ కార్యక్రమం నుంచి కొండా సురేఖ ఫోటో అవుట్. అసలు ఫొటో లేకపోవడం వెనుక ఏదైనా రాజకీయ సంకేతం ఉందా? లేక అధికారులు చేసిన పొరపాటా? కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల ఫొటోలు ఉండగా.. ఈ ఉమ్మడి జిల్లాకే చెందిన మంత్రి కొండా సురేఖ ఫొటో మాత్రం లేకపోవడం అనుమానాల్ని పెంచుతోంది. స్థానిక ఎమ్మెల్యేకు దీనిపై స్పష్టత లేదన్న ప్రచారం కూడా మరింత చర్చకు కారణమయ్యాయ్. మరోవైపు.. సురేఖ వ్యవహారం ఇప్పుడు ఏఐసీసీ పరిధికి వెళ్లింది.
పార్టీలో చర్చగా మారిన కొండా సురేఖ వ్యవహారం పైన పార్టీ హైకమాండ్ ఇప్పటికే పూర్తి స్థాయిలో సమాచారం సేకరించింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయ్. ఈ లోగానే కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారం పైన నిర్ణయం ప్రకటించేందుకు పార్టీ రెడీ అవుతోందంటున్నారు. అందులో భాగంగానే సీఎం రేవంత్… టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీకి వెళ్తున్నారని, ఇవాళ రాత్రికి కేసీ వేణుగోపాల్ అమెరికా నుంచి ఢిల్లీ రాగానే ఏదో ఒక విషయం తేలిపోతుందంటున్నారు.