Revanth Reddy: వెయ్యి రోజుల్లో ఒక్క గంట కూడా జనం కోసం కేసీఆర్ కేటాయించలేదు. ఇదీ సీఎం రేవంత్ సంధిస్తున్న ప్రశ్నాస్త్రం. కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడాన్ని టార్గెట్ చేసిన సీఎం రేవంత్రెడ్డి.. రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు. సెప్టెంబర్ ఒకటి నుంచి ఆరు వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆరో తేదీన హైదరాబాద్లో భారీ నిరసన నిర్వహించాలన్నారు. ఇది ప్రతిపక్ష వైఫల్యమని రేవంత్రెడ్డి ఎదురుదాడి చేశారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే.. అందులోనూ ప్రతిపక్ష నేత.. అసెంబ్లీకి దూరంగా ఉండడాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో జోరు పెంచారు సీఎం రేవంత్.
నెలనెలా జీతభత్యాలు తీసుకుంటూ.. ప్రభుత్వ సౌకర్యాలు పొందుతూ.. ఎలాంటి కారణం లేకుండా ప్రజల తరఫున సభలో నిలబడకపోవడం కరెక్టేనా? చట్టపరంగా 60 రోజుల గైర్హాజరుతో సభ్యత్వం వెంటనే రద్దు కాదు. సభ అనుమతి లేకుండా గైర్హాజరైతే సీటును ఖాళీగా ప్రకటించే అవకాశం ఉంటుంది. నిజానికి ఇలా సభకు రాని వాళ్లు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సభకు వచ్చి టెక్నికల్ గా వేటు పడకుండా ఉండేందుకు అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్లిపోతుంటారు.