Gannavaram Row: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విసిరిన ఒకే ఒక్క సవాల్.. ఏపీ రాజకీయాల్లో కార్చిచ్చు రగిల్చింది. గన్నవరం ఎయిర్పోర్ట్, టెర్మినల్ పనుల కాంట్రాక్ట్లో అక్రమాలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఆయన చేసిన ఆరోపణలు రాజకీయాల్లో పెద్ద భూకంపమే సృష్టించాయి. మౌలిక సదుపాయాల పేరు చెప్పి.. సొంత ఖజానా నింపుకున్నారంటూ యార్లగడ్డ చేసిన కామెంట్స్, ఇద్దరి నేతల మధ్య సాగుతున్న పాత కక్షలకు సరికొత్త ఆజ్యం పోశాయి.
జైలు నుంచి విడుదలై ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న వల్లభనేని.. సీఎం చంద్రబాబుకు ఏకంగా 32పేజీల లేఖ రాసి మళ్లీ పొలిటికల్ లైమ్లైట్లోకి వచ్చేశారు. ఇలా బయటకు వచ్చారో లేదో యార్లగడ్డ కామెంట్స్ విని తేలిగ్గా తీసిపారేయలేదు. లీగల్ నోటీసులతో కౌంటర్ అటాక్ ప్రారంభించారు. ఏడు రోజుల్లో ఆధారాలతో నిరూపించాలని డెడ్లైన్ విధించారు. లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు వల్లభనేని.
ఈ విషయంలో యార్లగడ్డ కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ తొడగొడుతున్నారు. ఒకవైపు అధినేతకు లేఖల రాయబారం.. ఇంకోవైపు ప్రస్తుత ఎమ్మెల్యేపై పోరాటంతో గన్నవరంపై పట్టు సాధించేందుకు వల్లభనేనిని వడివడిగా అడుగులు వేస్తున్నారు. మరి వంశీ విసిరిన ఛాలెంజ్ కోర్టు మెట్లు ఎక్కుతుందా? లేదంటే సవాళ్లు, ప్రతిసవాళ్లతో సరిపెట్టుకుంటుందా?