Viral Video : రీల్స్ పిచ్చి మామూలుగా ఉండదు. ఎక్కడపడితే అక్కడ వీడియోలు తీస్తుంటారు. తింటున్నా, తిరుగుతున్నా.. షాపింగ్ అయినా, స్లీపింగ్ అయినా.. ప్రతీదీ సోషల్ మీడియాలో పెట్టాల్సిందే. లైకులు, కామెంట్ల కోసం సర్కస్ ఫీట్లు, సాహసాలు చేసేవాళ్లూ తక్కువేం కాదు. రైలు పట్టాలపై పడుకోవడం, ట్రైన్కు ఎదురుగా పరుగెత్తడం.. బిల్డింగులు ఎక్కడం, దూకడం.. బస్సులు, బైకులు, పాములతో ఆటలాడటం ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు రీల్స్ చేస్తుంటారు. అయితే, అన్ని రీల్స్ ఒకేలా ఉండవు. కొన్ని సక్సెస్ అయితే, మరికొన్నిటికి శాడ్ ఎండింగ్. రీల్స్ చేస్తూ ప్రమాదాల బారిన పడేవాళ్లు కొందరైతే.. ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకునే వాళ్లు మరికొందరు. అలాంటిదే లేటెస్ట్గా ఓ దారుణం జరిగింది. ఆరుగురు అక్కాచెళ్లెళ్లు నదిలో సరదాగా రీల్స్ చేస్తుండగా కొట్టుకుపోయారు. ఆరుగురికి ఆరుగురు నీట మునిగి చనిపోవడం తీవ్ర విషాదంగా మారింది.
అసలేం జరిగిందంటే..
వాళ్లంతా ఉమ్మడి కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కాచెల్లెళ్లు. యూపీలోని ఆగ్రాలో ఉంటారు. ఇంటి పక్కనే యమునా నది ఉంటుంది. స్కూల్ హాలిడేస్ కావడంతో తరుచూ నదికి వెళ్లి సరదాగా గడుపుతుంటారు. నదిలోనే స్నానం చేస్తుంటారు. ఆ రోజు కూడా అలానే జరిగింది. ఆ ఆరుగురు యమునా నదిలో నీటిలో ఆడుతున్నారు. సెల్ఫీలు దిగుతున్నారు. రీల్స్ చేస్తున్నారు. రెగ్యులర్గా చేసే పనే కావడంతో వాళ్లంతా కేర్లెస్గా ఉన్నారు. అయితే, అన్ని రోజులూ ఒకేలా ఉండవుగా. ఉన్నట్టుండి సడెన్గా ఓ అమ్మాయి బ్యాలెన్స్ తప్పింది. చూస్తుండగానే నదీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆమెను కాపాడటానికి మరో ఇద్దరు ముందుకు వెళ్లారు. వాళ్లను సైతం నది లాగేసింది. అయ్యో అయ్యో అని అరుస్తూ.. మిగతా ముగ్గురు సోదరిలు కూడా తమ వారి కోసం నదిలోకి ముందుకు దిగారు. అంతే. వాళ్లంతా నీటిలో కొట్టుకుపోయారు. అలా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కాచెళ్లెళ్లు యమునా నదిలో కనిపించకుండా పోయారు.
గజ ఈతగాళ్లతో గాలింపు
నదికి సమీపంలో ఉన్న వారి బంధువులు చూస్తుండగానే ఇదంతా జరిగింది. ఒక్కసారిగా వారంతా అలర్ట్ అయ్యారు. తమ వారిని కాపాడటానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఆ ఆరుగురు నదిలో చాలాదూరం కొట్టుకుపోయారు. వారిని కాపాడటం కోసం గట్టిగానే ప్రయత్నించారు స్థానికులు. అదే నదిలో కాస్త దూరంలో పదవలో కొందరు చేపలు పడుతున్నారు. వారికి ఫోన్ చేసి.. ఇలా ఆరుగురు అమ్మాయిలు నదిలో కొట్టుకువస్తున్నారనే సమాచారం చేరవేశారు. ఆ మత్స్యకారులంతా గతఈతగాళ్లే కావడంతో ఆ అక్కాచెళ్లెళ్లు దొరుకుతారనే నమ్మకం కలిగింది. ఆ ఈతగాళ్లు నదిలో దూకి గాలించారు. ఘటనా స్థలానికి 1.5 కిలోమీటర్ దూరంలో ఆ ఆరుగురు అమ్మాయిలు కనిపించారు. వారిని వెంటనే ఒడ్డుకు చేర్చారు.
సీపీఆర్ చేసినా..
అప్పటికే వాళ్లంతా స్పృహతప్పి ఉన్నారు. CPR చేస్తే శ్వాస నిలుస్తుందనే నమ్మకంతో ఆ ప్రయత్నం కూడా చేశారు. అయితే, సీపీఆర్ చేసినా వారు బతకలేదు. ఆసుపత్రికి తరలిస్తే.. ఆ ఆరుగురు అక్కాచెళ్లెళ్లు నదిలోనే చనిపోయారని డాక్టర్లు తెలిపారు. ఆగ్రాలో ఈ ఉదంతం తీవ్ర విషాదంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : ఒక్క సెకన్లో ఎలా బతికిపోయాడో చూడండి.. వైరల్ వీడియో