90 Degrees Flyover| మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఒక వింత ఆకారంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందని ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఈ వంతెన 90-డిగ్రీల మలుపుతో వింతగా నిర్మాణం చేసినందుకే ఈ విమర్శలు వెలువెత్తాయి. అయితే తాజాగా ఇదే తరహా మరో వంతెన ఆంధ్రప్రదేశ్ లో కనిపించింది. దీని డిజైన్ కూడా ఇలాగే ఉందని.. ఆంధ్రలోని జిగ్జాగ్ హైవేపై ఉందంటూ అంటూ కాంగ్రెస్ కేరళ యూనిట్ ఇప్పుడు వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఆంధ్రప్రదేశ్లోని వాసుదేవపురం సమీపంలోని స్టేట్ హైవే 57లో ఉన్న ఒక వంతెన గూగుల్ మ్యాప్స్ స్క్రీన్షాట్ను షేర్ చేస్తూ.. కాంగ్రెస్ కేరళ ఎక్స్లో ఒక పోస్ట్ చేసింది. దాని క్యాప్షన్లో.. “భోపాల్ 90° ఫ్లైఓవర్ నిర్మించింది. ఆంధ్ర.. ‘హోల్డ్ మై చాయ్'” అని రాసింది.
ఈ పోస్ట్లో షేర్ చేసిన ఫొటోలో ఒకే వంతెనపై మూడు తీవ్రమైన మలుపులు ఉన్నాయి. ఈ ఫొటో ఇప్పుడు త్వరగా వైరల్ అయ్యింది. ఇప్పటికే ఏడు లక్షలకు పైగా వ్యూస్ దీనికి వచ్చాయి. సోషల్ మీడియా యూజర్లు.. “టెంపుల్ రన్ – ఆంధ్ర వెర్షన్” అని పిలిచారు. దీని వింత డిజైన్ను చూసి.. ఒక యూజర్.. “కోవిడ్ సమయంలో ఇంజనీర్లు చేసిన పని” అని హాస్యంగా వ్యాఖ్యానించారు.
భోపాల్ వంతెనపై భారీగా విమర్శలు
ఇటీవల భోపాల్ నగరంలోని ఐష్బాగ్ స్టేడియం సమీపంలో నిర్మించిన ఒక రైల్వే ఓవర్బ్రిడ్జ్ రూ.18 కోట్లతో నిర్మాణం చేశారు. ఈ వంతెన నిర్మాణం ప్రమాదకర ములుపులతో ఉండడంతో వివాదం మొదలైంది. 648 మీటర్ల పొడవైన ఈ వంతెన పైభాగంలో దాదాపు 90-డిగ్రీల మలుపుతో ఉన్న రోడ్డు ఆన్ లైన్ యూజర్లను ఆశ్చర్యపరిచింది. ఈ డిజైన్ చూసి రోడ్డు భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఈ ప్రాజెక్టును తీవ్రంగా విమర్శించారు. “ప్రభుత్వం మేల్కొనకపోతే ఇది మరణ భూమిగా మారుతుంది. ఇంత ప్రమాదకరంగా నిర్మాణం ఎలా చేశారు.” అని ఆయన అన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పిడబ్ల్యూడీ) ఈ డిజైన్ను సమర్థిస్తూ.. సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద రైల్వే భూమి చాలా తక్కువగా ఉండడం కారణంగానే ఇలా నిర్మాణం చేశారని చెప్పింది.
పిడబ్ల్యూడీ (బ్రిడ్జ్ డిపార్ట్మెంట్) చీఫ్ ఇంజనీర్ వీడీ వర్మా.. మీడియాతో మాట్లాడుతూ.. “మెట్రో స్టేషన్ కారణంగా ఆ ప్రాంతంలో స్థలం పరిమితంగా ఉంది. స్థలం లేకపోవడం వల్ల వేరే ఆప్షన్ లేదు. ఈ ఓవర్బ్రిడ్జ్ రెండు కాలనీలను అనుసంధానించడానికి నిర్మించబడింది” అని అన్నారు. ఈ వంతెనపై భారీ వాహనాలను అనుమతించరని, కేవలం లైట్ వాహనాలు మాత్రమే నడుస్తాయని.. ప్రమాదాలు జరిగే అవకాశాలు లేవని ఆయన తెలిపారు. అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఈ డిజైన్పై ప్రశ్నలు లేవనెత్తింది. “ప్రభుత్వం ఈ వంతెన మరణ భూమిగా మారకముందు మేల్కొవాలి” అని అన్నారు.
Also Read: మహిళా ఉద్యోగి ఇంట్లో ఎవరూలేనప్పుడు దొంగ చాటుగా ప్రవేశించిన బాస్.. ఆమె రాగానే అండర్వేర్లో..
సోషల్ మీడియాలో వ్యంగ్యం
సోషల్ మీడియాలో ఈ వంతెనలపై యూజర్లు హాస్యాస్పదంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. భోపాల్ వంతెనను “టెంపుల్ రన్ – భోపాల్ వెర్షన్” అని కొందరు పిలిచారు. ఆంధ్రప్రదేశ్ వంతెనను చూసి.. “ఇది కోవిడ్ సమయంలో ఇంజనీర్లు రూపొందించినట్లు ఉంది” అని మరొకరు జోక్ చేశారు. ఈ వైరల్ చిత్రాలు ప్రజల్లో నవ్వు తెప్పించినప్పటికీ.. పబ్లిక్ వర్క్స్లో భద్రతా లోపాలు, పేలవమైన ప్రణాళికపై ఆందోళనలను మరింత పెంచాయి.