BR Shetty Story: కాలం వింత ఆటలు ఆడుతుంది. ఎవరిని.. ఎప్పుడు.. ఎలా మార్చుతుందో తెలియదు. జీరోలను హీరోలను చేస్తుంది. హీరోలను జీరోలను చేస్తుంది. బికారిని కోటీశ్వరుడిని చేస్తుంది. కోట్లకు పడగలెత్తిన వాడిని కట్టుబట్టలతో నడి బజారులో నిలబెడుతుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహారణ బీఆర్ శెట్టి అలియాస్ బావగుతు రఘురామ్ శెట్టి. మెడికల్ రిప్రసెంటివ్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన, ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగాడు. దుబాయ్ లో అతిపెద్ద మెడికల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన చేసిన ఒకే ఒక్క తప్పుతో ఆకాశం నుంచి పాతళంలోకి పడిపోయాడు. 12 వేల కోట్ల రూపాయలు విలువ చేసే కంపెనీని కేవలం రూ. 74కు అమ్మి ప్రపంచాన్ని షాక్ కు గురి చేశాడు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి? ఎందుకు ఆయన వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది?
అసలు ఎవరీ బిఆర్ శెట్టి?
బ్రిటీష్ ఇండియాలోని మద్రాస్ రెసిడెన్సీ ఉడిపిలో(ఇప్పుడు కర్నాటక) 1942 ఆగష్టు 1న ఓ మధ్య తరగతి కుటుంబంలో బీఆర్ శెట్టి జన్మించాడు. ఆయన పూర్తిపేరు బావగుతు రఘురామ్ శెట్టి. ఒకప్పుడు భారత్ లోని సంపన్న వ్యక్తులలో ఒకడిగా కొనసాగాడు. 2015లో ఫోర్బ్స్ లిస్టులో భారత లో 100 మంది అత్యంత సంపన్నుల జాబితాలో స్థానం సంపాదించారు. 2019లోనూ 42వ ధనవంతుడిగా గుర్తింపు తెచ్చకున్నాడు.
మెడికల్ రిప్రజెంటివ్ గా కెరీర్ ప్రారంభం
బిఆర్ శెట్టి మెడికల్ రిప్రజెంటివ్ గా కెరీర్ మొదలు పెట్టాడు. 31 ఏండ్ల వయసులో అవకాశాల కోసం 1973లో దుబాయ్కి వెళ్లాడు. కేవలం 8 డాలర్లతో ఆయన దుబాయ్ లో అడుగు పెట్టాడు. అక్కడ సేల్స్ మ్యాన్ గా మారి మందులు అమ్మేవాడు. తక్కువ సమయంలో శెట్టికి గొప్పవారితో పరిచయం ఏర్పడింది. కొద్ది సంవత్సరాల తర్వాత దుబాయ్ లో తొలి ప్రైవేట్ హెల్త్ కేర్ ప్రొవైడర్ కంపెనీ అయిన న్యూ మెడికల్ సెంటర్ హెల్త్ (NMC)ను స్థాపించాడు. ఆ తర్వాత NMC అతిపెద్ద ప్రైవేట్ హెల్త్ కేర్ ప్రొవైడర్ గా మారింది. 8 దేశాలు 12 నగరాల్లో విస్తరించింది. గల్ఫ్ సహకార దేశాల (GCC) నుంచి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రీమియం విభాగంలో లిస్ట్ అయిన మొదటి ఆరోగ్య సంరక్షణ సంస్థగా NMC గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత శెట్టి UAE ఎక్స్ఛేంజ్ ను కూడా స్థాపించాడు. ఇది రెమిటెన్స్, ఫారిన్ ఎక్స్ఛేంజ్, బిల్ చెల్లింపు సేవలను నిర్వహించేది. 70ల చివరలో UAEలో నివసిస్తున్న భారతీయ ప్రవాసులు స్వదేశంలోని తమ కుటుంబాలకు డబ్బు పంపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గమనించిన ఆయన.. UAE ఎక్స్ఛేంజ్ ను స్థాపించారు. ఈ సంస్థ 2016లో 31 దేశాలలో 800 కార్యాలయాలను ప్రారంభించింది.
ఆకాశం నుంచి పాతాళంలోకి..
ఆరోగ్యం, ఆర్థికం, రియల్ ఎస్టేట్ తో సహా ఎన్నో రంగాల్లో రాణించిన శెట్టి, ఒకానొక సమయంలో ఆయన సంపద $3 బిలియన్లకు (సుమారు రూ. 20,000 కోట్లు) చేరుకుంది. భారతీయ వ్యాపార దిగ్గజం విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. ప్రైవేట్ జెట్లు, రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉండేవాడు. బుర్జ్ ఖలీఫాలో రెండు అంతస్తులు ఉండేవి. దుబాయ్ అంతటా అనేక విలాసవంతమైన విల్లాలను కొనుగోలు చేశారు.
NMCలో ఆర్థిక అవకతవకలు
2019లో కంపెనీలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు తేలడంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారు అయ్యింది. కంపెనీ అప్పులను చూపించకుండా శెట్టి దాచి పెట్టాడని రీసెర్చ్ సంస్థల నివేదికలు వెల్లడించాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కంపెనీ షేర్ల ధరలు అమాంతం పడిపోయాయి. చివరికి అతడు తన రూ.12,478 కోట్ల కంపెనీని ఇజ్రాయెల్-యుఎఇ కన్సార్టియానికి కేవలం రూ.74కి విక్రయించాల్సి వచ్చింది. 2020లో దర్యాప్తు సంస్థల విచారణల నడుమ బిఆర్ శెట్టి తన బోర్డు పదవికి రాజీనామా చేశాడు. NMC హెల్త్ యునైటెడ్ కింగ్ డమ్ ఆధీనంలోకి వెళ్లిపోయింది. అదే సమయంలో NMC హెల్త్ పై UAE అటార్నీ జనరల్ కార్యాలయంలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజుల తరువాత, UAE సెంట్రల్ బ్యాంక్ శెట్టి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని, అతడి సంస్థలను బ్లాక్ లిస్ట్ చేయాలని ఆదేశించింది. భారత్ లోనూ ఆయన కంపెనీలపై విచారణ కొనసాగుతోంది. ఒకప్పుడు వెలుగు వెలిగిన శెట్టి.. ఒకే ఒక్క తప్పుతో ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది.
Read Also: పైసా ఖర్చులేకుండా ఏడాదిగా ట్రైన్ లో ఫ్రీ జర్నీ, ప్రయాణీకుడి తెలివికి రైల్వే అధికారుల షాక్!