దొంగల నుంచి ప్రజలకు కాపాడాల్సిన పోలీసులే దొంగలుగా మారిపోయారు. సైబర్ నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్మును బాధితులకు అప్పగించాల్సిందిపోయి.. తానే కొల్లగొట్టాడు ఓ ఎస్సై. ఈ ఘన కార్యంలో అతడికి ప్రియురాలైన మరో లేడీ ఎస్సై హెల్ప్ చేసింది. ఇద్దరూ కలిసి దొంగల సొమ్ముతో దర్జాగా టూర్లు ఎంజాయ్ చేశారు. తాజాగా పోలీసులకు చిక్కడంతో వాళ్ల అసలు కథ బయటకు వచ్చింది. ఈ దొంగ పోలీసుల కథ ఢిల్లీలో జరిగింది.
ఇంతకీ అసలు ఏమైందంటే?
ఢిల్లీ సైబర్ క్రైమ్స్ విభాగంలో అంకుర్ మాలిక్ ఎస్సైగా పని చేస్తున్నాడు. కీలక సైబర్ మోసాలకు సంబంధించిన పలు కేసులను ఆయన డీల్ చేశాడు. సైబర్ నేరగాళ్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను రికవరీ చేశాడు. ఆ డబ్బును కోర్టుకు అప్పగించాడు. అక్కడ వరకు బాగానే ఉన్నా, ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది. సైబర్ నేరాల్లో జప్తు చేసిన డబ్బును కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించి తనకు తెలిసిన వాళ్ల ఖాతాల్లోకి మళ్లించాడు. ఆ తర్వాత వారికి కొంత డబ్బు ఇచ్చి, మిగతాది తను తీసుకునేవాడు. ఇలా సుమారు రూ.2 కోట్లు స్వాహా చేశాడు. ఈ కథ నడపడంలో ఆయన ప్రియురాలైన నేహాపూనియా అనే లేడీ ఎస్సై సహకరించింది. నేహా ఢిల్లీలోనే మరో పోలీస్ స్టేషన్ లో పని చేస్తోంది.
పెళ్లైనా ప్రేమాయణం!
నిజానికి అంకుర్, నేహాకు ఇప్పటికే పెళ్లి అయ్యింది. అనప్పటికీ ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల వీరిద్దరు వారం రోజులు సిక్ లీవ్ పెట్టారు. గోవా, మనాలీ, జమ్మూ కశ్మీర్ టూర్ కు వెళ్లారు. సెలవు గడువు ముగిసినా, రాకపోవడంతో అధికారులకు అనుమానం కలిగింది. వీరిపై ఎంక్వయిరీకి ఆదేశించారు. పోలీసుల విచారణలో వీరిద్దరు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరూ పేర్లు మార్చుకుని అక్కడే సెటిల్ కావాలని భావించారు. పోలీసులు వారిని పట్టుకోవడంతో అసలు కథ బయటపడింది. వీరి నుంచి రూ. 1 కోటి విలువైన బంగారం, 11 మొబైల్ ఫోన్లు, మూడు ATM కార్డులు, ఒక ల్యాప్ టాప్ సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ రిమాండ్ లో ఉన్నారు.
డబ్బును బంగారంగా మార్చిన మరో ముగ్గురు అరెస్ట్
అటు తమ దగ్గర ఉన్న నగదును బంగారంగా మార్చారు అంకుర్, నేహా. లాండరింగ్ ఆపరేషన్ కోసం మహ్మద్ ఇలియాస్, ఆఫి అలియాస్ మోను, షాదాబ్ అనే మరో ముగ్గురు వ్యక్తుల బ్యాంకు అకౌంట్లను వినియోగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు ఎస్సైలు కలిసి ఎంత డబ్బును కొల్లగొట్టారు? అనే విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు.
Read Also: ఇస్కాన్ రెస్టారెంట్ లో చికెన్ తిన్న యువకుడు, నిప్పులు చెరుగుతున్న భక్తులు!