UP News: సరిగ్గా వారం క్రితం.. నవంబర్ 25న జరిగిన వివాహం.. మరుసటి రోజు నవంబర్ 26న కేవలం 20 నిమిషాలలోనే మ్యారేజ్ రద్దు కావడం ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో సంచలనం కలిగించింది. యూపీలోని డియోరియా జిల్లాలోని భలుఅని నగర పంచాయతీకి చెందిన యువకుడు, సలేంపూర్ నగర పంచాయతీకి చెందిన యువతికి పెళ్లి నిశ్చయమైంది. వరుడి తరఫు బరాత్ నవంబర్ 25న డియోరియాలోని మ్యారేజ్ హాల్కి ఘనంగా చేరుకుంది. వధువు కుటుంబసభ్యులు ఘన స్వాగతం కూడా పలికారు. ద్వారపూజ, జైమాల లాంటి హిందూ సంప్రదాయ కార్యక్రమాలతో వివాహం జరిగింది.
మరుసటి రోజు ఉదయం పెళ్లికూతురు అత్తవారింటికి వచ్చింది. అత్తారింట్లో ముఖం చూసే కార్యక్రమం మొదలైంది. సరిగ్గా అదే సమయంలో వధువు ఒక్కసారిగా బయటకు వచ్చింది. అత్తవారింట్లో ఉండడానికి ఆమె నిరాకరించింది. వెంటనే పుట్టింటికి వెళ్లాలనే పట్టుబట్టింది. భర్త, అత్తవారింటి కుటుంబసభ్యులు ఆమెకు ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
కొంత సమయానికి వధువు తల్లిదండ్రులు సైతం అక్కడికి చేరుకున్నారు. దాదాపు ఐదు గంటల పాటు పంచాయతీ జరిగింది. చర్చల సమయంలో.. వధువు మొండిగా తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. అత్తవారింటి వారి ప్రవర్తన నచ్చలేదనే కారణం చెప్పింది. దాంతో, భర్తతో కాపురం చేయనని తెగేసి చెప్పింది.
చివరికి.. ఇరుపక్షాలు పరస్పరం అంగీకరించి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఒకరికొకరు ఇచ్చిన సామానులు, బహుమతులు తిరిగి ఇచ్చేయాలని తీర్మానం చేశారు. ఈ ఒప్పందం తర్వాత వధువు తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ సంఘటనతో వారి వివాహ బంధం కొలాప్స్ అయ్యింది. దీనిపై పోలీసు స్టేషన్లో కేసు నమోదు కాలేదని ఇన్ఛార్జ్ ప్రదీప్ పాండే తెలిపారు. పంచాయతీలో ఇరుపక్షాలు అంగీకారంతో విడిపోవడం వల్ల చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఆయన వివరించారు. ఈ ఘటన డియోరియా జిల్లాలో చర్చనీయాంశమైంది.
ALSO READ: OTT Movie : ఇదేం ఫ్యామిలీ భయ్యా ఇలా ఉంది… ఇంటికొచ్చిన కోడలిపై ఒక్కొక్కరూ… మామూలు స్టోరీ కాదు