కర్ణాటకలోని సౌత్ కన్నడ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. కేఎస్ఆర్టీసీ అధికారుల అశ్రద్ధ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. బోర్డు పరీక్షలు రాసేందుకు వెళ్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు ప్రయాణిస్తున్న బస్సు తలుపు ఒక్కసారిగా ఊడిపోవడంతో వారు రోడ్డుపై పడిపోయారు. ఈ హృదయ విదారక ఘటన స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో తీవ్ర సంచలనం సృష్టించింది. విద్యా సంవత్సరం ముగింపులో పరీక్షల కోసం సిద్ధమైన ఆ ఇద్దరు విద్యార్థినులు ప్రస్తుతం ఆసుపత్రి పాలవ్వడం అందరినీ కలచివేస్తోంది.
వివరాల ప్రకారం.. సౌత్ కన్నడ జిల్లాలో నిత్యం రద్దీగా ఉండే ఒక మార్గంలో కేఎస్ఆర్టీసీ బస్సు బయలుదేరింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. లోపల నిలబడటానికి కూడా ఖాళీ లేకపోవడంతో విద్యార్థినులు బస్సు వెనుక వైపు ఉన్న డోరు వద్దే నిలబడ్డారు. బస్సు వేగంగా వెళ్తున్న క్రమంలో తలుపు ఉన్నట్టుండి ఊడిపోయి కింద పడిపోయింది. దానిని ఆనుకుని నిలబడిన ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ నియంత్రణ కోల్పోయి రోడ్డు మీద పడ్డారు. వేగంగా వెళ్తున్న బస్సు నుంచి పడటంతో వారికి శరీరమంతా తీవ్రమైన గాయాలయ్యాయి.
ఒక్కసారిగా ఊడిపోయిన రన్నింగ్ బస్సు డోరు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు
కర్ణాటకలోని సౌత్ కన్నడ జిల్లాలో ఘటన
బోర్డు పరీక్షలు రాయడానికి ఆర్టీసీలో బస్సు ఎక్కిన అక్కాచెల్లెళ్లు
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో డోరు వద్ద నిలబడిన విద్యార్థినులు
ఒక్కసారిగా బస్సు డోరు ఊడిపోవడంతో… pic.twitter.com/nfemK7TsZz
— BIG TV Breaking News (@bigtvtelugu) March 31, 2026
ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్థానికులు స్పందించారు. రక్తపు మడుగులో ఉన్న విద్యార్థినులను హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందుతోంది. తృటిలో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్తున్నారు. బస్సు లోపల ఉండాల్సిన తలుపు అంత తేలికగా ఎలా ఊడిపోయిందని స్థానికులు రవాణా శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలం చెల్లిన బస్సులను రోడ్లపై తిప్పడం వల్లే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు మేలుకున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్.. మెకానికల్ కండిషన్ మీద ఆరా తీస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరీక్షలు రాసి ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాల్సిన విద్యార్థినులు ఇలా రోడ్డు ప్రమాదం బారిన పడటం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ALSO READ: Shaheen Afridi : రూ. 20 కోట్లు ఇచ్చి, కాళ్లు మొక్కినా ఐపీఎల్ లోకి రాను