HYDRAA: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని సర్కారు ఆస్తులను కాపాడేందుకు ఏర్పడిన హైడ్రా మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఒకే సారి భారీ ఆపరేషన్లు నిర్వహించింది. ఇందులో పెద్ద సంఖ్యలో ఆక్రమణలు తొలగించింది. ఐటీ కారిడార్కు చేరువలో మంచి రేవుల వద్ద ఉన్న 8.24 ఎకరాల నాగిరెడ్డి కుంటను కాపాడటంతో పాటు ఘట్కేసర్ మండలంలోని ఔషాపూర్లో 1440 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా పరిరక్షించింది. దుండిగల్–గండిమైసమ్మ మండలం బౌరంపేట గ్రామ పరిధిలో గండిమైసమ్మ, మియాపూర్ ప్రధాన రహదారిపై అక్రమంగా నిర్మించిన షెడ్లను హైడ్రా తొలగించింది. ఇలా నగరంలో పలు చోట్ల ఆక్రమణలను మంగళవారం హైడ్రా తొలగించటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం, మంచిరేవుల గ్రామంలో ఏకంగా చెరువును మాయం చేసేయాలని చూసిన కబ్జాదారుల ప్రయత్నాలకు హైడ్రా మంగళవారం చెక్ పెట్టింది. బడా నిర్మాణ సంస్థలు పలు స్థలాలను అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నాలు చేసినట్లు హైడ్రా నిర్థారించింది. 8.24 ఎకరాల నాగిరెడ్డి కుంటకు నలువైపులా కబ్జాలకు తెరదీశారు. గ్రామ, రెవెన్యూ రికార్డుల్లో చెరువుగా స్పష్టమైన ఆధారాలున్నాయి. 8.24 ఎకరాల చెరువుగా హెచ్ఎండీఏ కూడా గుర్తించింది. చెరువు కనిపించకుండా ఏకంగా 20 ఫీట్ల టిన్ షీట్స్తో ప్రహరీ నిర్మించి 4 ఎకరాలకు బడా రియల్ ఎస్టేట్ సంస్థ ఫెన్సింగ్ వేసింది. 20 ఫీట్ల రేకుల గోడ కట్టి లోపల చెరువు ఉందనేది కూడా తెలియకుండా ఆక్రమణలకు తెగబడింది.
మరో వైపు ఇంకో నిర్మాణ సంస్థ 3 ఎకరాలను కబ్జా చేసింది. స్థానిక మాజీ ప్రజాప్రతినిధి కూడా ఎకరానికిపైగా కబ్జా చేసి వేరేవాళ్లకు అమ్మినట్లు హైడ్రా గుర్తించింది. ఇలా 8.24 ఎకరాల చెరువును కబ్జా చేసి అమ్ముకునే ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. ప్లాట్లుగా మార్చి ప్రీకాస్ట్ ఇటుకలతో ప్రహరీలు నిర్మించి అందులో నిర్మించిన తాత్కాలిక గదులను హైడ్రా పూర్తిగా తొలగించింది. చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. 8.24 ఎకరాల నాగిరెడ్డికుంట కబ్జాలకు గురైందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో పరిశీలించిన హైడ్రా మంగళవారం చర్యలు తీసుకుంది. హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకోవడంతో నాగిరెడ్డి కుంటను బతికించుకున్నామని, ఏమాత్రం ఆలస్యం చేసినా శాశ్వత నిర్మాణాలు వచ్చేసేవని స్థానికులు పేర్కొన్నారు.
Also Read: సత్తుపల్లిలో ఏసీబీ మెరుపు దాడులు కలకలం
మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ – గండిమైసమ్మ మండలం బౌరంపేట గ్రామ పరిధిలో ప్రధాన రహదారిపై అక్రమంగా నిర్మించిన షాపులను హైడ్రా మంగళవారం తొలగించింది. 150 అడుగుల ప్రధాన రహదారికి ఇరువైపులా ఓ వ్యక్తి ఆక్రమణలకు పాల్పడి తాత్కాలిక షెడ్డులు వేసి అద్దెలకు నడుపుతున్నాడనే ఫిర్యాదులను హైడ్రా క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. ఆక్రమణలతో రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తించింది. ఇందులో స్క్రాప్ దుకాణాలు, ఇతర షాపుల వాళ్లకు రెండు నెలల ముందే ఖాళీ చేయాలని చెప్పి రహదారిని ఆనుకుని నిర్మించిన 10 షాపులు(షెడ్డులు)ను తొలగించింది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగినట్టయ్యింది. హైడ్రా అధికారుల చర్యలను స్థానికులు అభినందిస్తూ, రహదారిని విముక్తి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
మెద్చల్ – మల్కాజ్ గిరి జిల్లా ఘట్కేసర్ మండలం ఔషాపూర్ గ్రామ పరిధిలో 68వ సర్వే నెంబరులో 1987లో 60 ఎకరాల మేర లే ఔట్ వేశారు. ఇందులో 1440 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. తర్వాత కొద్ది రోజులకు దాన్ని ప్లాట్లుగా మార్చారు. 6 ప్లాట్లు చేశారు. ఇదే విషయాన్ని హైడ్రా ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేశారు. అమ్మకాలు జరుగుతున్న సమయంలోనే పార్కు స్థలమంటూ హైడ్రా అడ్డుకుంది. మంగళవారం పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థలంగా పేర్కొంటూ బోర్డులను కూడా ఏర్పాటు చేసింది.
Also Read: ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే.. ఇంట్లో ఉన్న పాత గిన్నెలన్నీ ఇండక్షన్ స్టవ్పై వాడేసుకోచ్చు!