పూడిమడకకు చెందిన మత్స్యకారుడు యర్రయ్య (42), తన మిత్రులతో కలిసి మంగళవారం తెల్లవారుజామున చేపల వేటకు వెళ్లాడు. రోజూ లాగే మత్స్యకారుల బోటు సముద్రం లోతుల్లోకి దాదాపు 30 కిలోమీటర్ల దూరం వెళ్ళి వేట ప్రారంభించారు.
వేట కొనసాగుతుండగా, గాలంలో భారీ పరిమాణం కలిగిన ఒక “కొమ్ముకోనాం” (Giant Trevally) చేప చిక్కింది. అంచనా ప్రకారం దాని బరువు సుమారు 100 కిలోల పైమాటే ఉంటుంది. గాలానికి చిక్కిన ఆ చేపను చూసిన మత్స్యకారులు ఆశ్చర్యానికి గురయ్యారు. తాడుతో బోటులోకి లాగే ప్రయత్నం చేశాడు. చేప బలంగా యర్రయ్యను నీటిలోకి లాక్కెళ్లడంతో గల్లంతయ్యాడు. గ్రామస్థులు గాలించినా ఫలితం లేకుండా పోయింది.
సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు కొమ్ముకోనాం చేపతో ప్రమాదం పొంచి ఉంటుందని మత్స్యకారులు అంటున్నారు. 80 కేజీల నుంచి 250 కేజీల బరువు ఉండే కొమ్ముకోనం చేప చాలా వేగంగా ఈదుతుందని చెప్తున్నారు. వలల్లో చిక్కుకున్న చేప వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని, గాలానికి చిక్కుకున్న చాపకు స్పేర్ గాలం వేయకపోతే మనుషులను సైతం లాక్కుపోతుందని అంటున్నారు.
తీవ్రంగా స్పందించిన గ్రామస్థులు
వెంటనే మిగతా మత్స్యకారులు తీరానికి చేరుకుని.. గ్రామస్థులకు విషయం చెప్పారు. వార్త తెలుసుకున్న పూడిమడక వాసులు దర్యాప్తు చర్యల్లో పాల్గొన్నారు. ఇంజిన్లతో బోట్లు వేసి సముద్రంలో గాలింపు చేపట్టారు. కానీ గంటల పాటు గాలించినప్పటికీ యర్రయ్య ఆచూకీ కనపడలేదు.
యర్రయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. వేటకు వెళ్లినప్పుడల్లా భయంతో ఎదురుచూసే కుటుంబానికి ఇది ఊహించని విషాదం. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామ పెద్దలు అధికారులను కలిసి తక్షణ సహాయాన్ని ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.
సముద్రంలోని ప్రమాదకర వాస్తవాలు
ప్రతి సంవత్సరం మత్స్యకారులు సముద్రంలో.. చేపల వేట చేస్తుండగా ఇలాంటి అనుకోని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అనేకసార్లు పెద్ద చేపల దాడిలో, గాలం చీలిపోవడం, లేదా తాడులు తెగిపోవడం వంటివి ప్రాణాంతక పరిస్థితులను కలిగిస్తుంటాయి. అనుభవజ్ఞులైన మత్స్యకారులే కూడా ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోలేని పరిస్థితుల్లో పడుతుంటారు.
జీవనోపాధి కోసం సముద్రాన్ని ఆశ్రయించే.. వర్గాల భద్రత కోసం ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టమవుతోంది. ప్రమాద నివారణ పరికరాల పంపిణీ, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, భద్రతా నిబంధనల అమలు వంటి అంశాల్లో మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.