Fact Check: సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు అరుదైన, విలువైన చేపలు దొరుకుతుంటాయి. లక్షల విలువ చేసే చేపలు దొరికాయనే వార్తలు తరచుగా వింటూనే ఉంటాం. తాజాగా సోషల్ మీడియాలో అలాంటి ప్రచారమే జరిగింది. నైజీరియాకు చెందిన జాలర్లకు అరుదైన బ్లూ మారిన్ చేప దొరికింది. దీని ధర అక్షరాలా $2.6 మిలియన్లు( భారత కరెన్సీలో ఈ ధర సుమారు రూ.22,62,28,988) ఉంటుందని ప్రచారం జరిగింది. ఈ చేపను అమ్మడానికి బదులుగా ఊరి ప్రజలంతా కలిసి వండుకుని తిన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
“ఒక నైజీరియన్ వ్యక్తి $2.6 మిలియన్ల విలువైన చేపను పట్టుకున్నాడు. అతడు తన గ్రామస్తులతో కలిసి దాన్ని అమ్మకుండా వండి తినేశారు” అని మార్చి 9, 2021న ఫేస్ బుక్ లో ఈ పోస్టు షేర్ చేశారు. దక్షిణాఫ్రికాలో ఈ పోస్ట్ లు వేల సార్లు షేర్ చేయబడ్డాయి. ఆఫ్రికా ఫాక్ట్స్ జోన్ అనే ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ఈ ట్వీట్ ను 5,500 కంటే ఎక్కువ సార్లు రీట్వీట్ చేశారు. దీనికి 13 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. అయితే, ఈ వార్తలో నిజం ఎంత? అనే విషయంపై కొంత మంది ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఈ పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
A Nigerian man captured a Blue Marlin Fish worth $2.6 million. Him and his village people ate it. pic.twitter.com/awcJ3TlZRF
— Africa Facts Zone (@AfricaFactsZone) March 8, 2021
అసలు వాస్తవం ఏంటంటే?
ఫ్యాక్ట్ చెక్ లో ఆ చేపకు నిజంగా అంత ధర ఉండదని తేలింది. అయితే, ఈ ధరను అమెరికాలో యాన్యువల్ ఫిషింగ్ పోటీలో గెలుచుకున్న ప్రైజ్ మనీతో పోల్చి $2.6 మిలియన్లు ఉంటుందని ప్రచారం చేశారు. నిజానికి అది మార్కెట్ విలువను సూచించదని వెల్లడించారు. అంతేకాదు.. సోషల్ మీడియా షేర్ చేసిన ఫోటోల్లోఎల్లో టీ-షర్ట్ లో ఉన్న వ్యక్తిని సదరు చేపను పట్టుకున్న వ్యక్తిగా ప్రచారం చేశారు. ఇందులోనూ ఏమాత్రం నిజం లేదు. ఈ ఫోటోలో ఎల్లో టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి అతడు జాలరి కానే కాదు. ఆ చేపను ఒడ్డుకు తీసుకెళ్లేందుక సాయం చేసిన వ్యక్తిగా తేల్చారు. ఇక ఈ చేపను మత్స్యకారులు మొదట అమ్మడానికి ప్రయత్నించారు. కానీ, ఎవరూ కొనుగోలు చేయలేదు. చివరికి దానిని ముక్కలుగా చేసి విక్రయించారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఒక్కో ముక్కను సుమారు $5.25 డాలర్లకు విక్రయించినట్లు తెలిపారు.
బ్లూ మార్లిన్ విలువ ఎంత ఉంటుందంటే?
2019లో అమెరికాలో జరిగిన ఫిషింగ్ స్పోర్ట్స్ టోర్నమెంట్ లో బ్లూ మార్లిన్ చేప $2.6 మిలియన్ల ధర పలికింది. అయితే, ఈ ధర మార్లిన్ చేపల మార్కెట్ విలువ కంటే చాలా ఎక్కువ. నైజీరియా జాలర్లు ఆ చేపను పెద్ద మొత్తంలో ధరకు అమ్మి ఉండరని ఫిషింగ్ స్పోర్ట్స్ టోర్నమెంట్ నిర్వాహకులు వెల్లడించారు. అటు దక్షిణాఫ్రికాలోని హుక్డ్ ఆన్ ఆఫ్రికా ఫిషింగ్ చార్టర్స్ కు కెప్టెన్ అయిన సీన్ అమోర్ రోవాన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. రెండు దశాబ్దాలకు పైగా ఫిషింగ్ అనుభవం ఉన్న ఆయన.. మార్లిన్ బ్లూ మార్కెట్ విలువ ఎప్పటికీ మిలియన్ డాలర్లు ఉండదని తేల్చి చెప్పారు. సో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది.
Read Also: ఏపీ నుంచి యూపీకి మూడేళ్ల జర్నీ.. అత్యంత ఆలస్యమైన రైలుపై PIB ఆసక్తిర వ్యాఖ్యలు!