సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ టాపిక్ ట్రెండింగ్ లోకి వస్తుందో ఎవరూ ఊహించలేం. మొన్నటికి మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తర్వాత సోషల్ మీడియాలో ఎంతోమంది అనలిస్ట్ లు పుట్టుకొచ్చారు. సీసీ టీవీ ఫుటేజీలతో ఆ వార్తలు కాస్త చల్లబడ్డాక అలేఖ్య చిట్టి పికిల్స్ మేటర్ హాట్ టాపిక్ గా మారింది. నాలుగు రోజులపాటు ఆ పచ్చళ్లు, బూతులు తిట్టే మెసేజ్ లు, వారి డ్యాన్స్ లు వైరల్ గా మారాయి. చాలామంది సెల్ఫ్ మేడ్ అనలిస్ట్ లు వారిది తప్పు అని, కొంతమంది కరెక్ట్ అని.. సోషల్ మీడియాలో డిస్కషన్ పెట్టారు. రేపు ఏ టాపిక్ హైలైట్ అవుతుందో వేచి చూడాలి.
హాట్ టాపిక్స్..
సందర్భం లేకపోయినా, తమకి సంబంధం లేకపోయినా హాట్ టాపిక్స్ ని టచ్ చేస్తే అందరూ పాపులర్ అయిపోవచ్చు, ట్రెండింగ్ టాపిక్ లో తలదూరిస్తే మన అకౌంట్ కి కూడా ఫాలోవర్స్ పెరగొచ్చనే ఆలోచనతో చాలామంది హైలైట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఫేక్ ప్రాపగాండాతో ఇరుకున పడుతున్నారు కూడా. ఇటీవల కాలంలో ఇలాంటి చాలా అంశాలు అనుకోకుండా హైలైట్ అవుతున్నాయి. ఆమధ్య బెట్టింగ్ యాప్స్ అంశం బాగా పాపులర్ అయింది. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వారి వివరాలు బయటకు తీసి ఆ వీడియోలను వైరల్ చేశారు నెటిజన్లు. చివరకు ఆ కేసులో పోలీసులు కొంతమందిని విచారణకు పిలిపించడంతో వ్యవహారం కాస్త పాతబడినట్టయింది. ఆ తర్వాత ప్రవీణ్ పగడాల మరణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
యాక్సిడెంటా..? హత్యా..?
వాస్తవానికి ప్రవీణ్ పగడాల వ్యవహారంలో అది ఒక సాధారణ యాక్సిడెంట్ గా వెలుగులోకి వచ్చింది. అయితే అంతకు ముందే ఆయన తన ప్రాణాలకు హాని ఉందని ఒక వీడియో చేయడంతో ఆయన్ను హత్య చేశారని కొందరు అనుమానించారు. ఆ అనుమానాన్ని బేస్ చేసుకుని ఇంకొందరు అది హత్యేనంటూ తీర్మానించారు. హర్షకుమార్ లాంటి నేతలు స్పాట్ కి వెళ్లి మరీ ఇన్వెస్టిగేషన్ చేసి వచ్చారు. చివరకు సీసీ టీవీ ఫుటేజీ విడుదలైన తర్వాత కొంతమంది శాంతించారు. ఇప్పటికీ ఇంకొందరు ఆ ఘటనను హత్యగానే భావిస్తున్నారు. ఆ దిశగానే ఎంక్వయిరీ జరగాలంటున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తున్నారు.
వైరల్ పికిల్స్..
ప్రవీణ్ మరణం తర్వాత మళ్లీ ఆ స్థాయిలో పాపులర్ అయిన సబ్జెక్ట్ అలేఖ్య చిట్టి పికిల్స్. పచ్చళ్లు మరీ ఇంత కాస్ట్ లీనా అని అడిగినందుకు.. చీప్ ఫెలో అంటూ బూతులు తిడుతూ చిట్టి పికిల్స్ యజమానులుగా చెప్పుకుంటున్న ఓ యువతి పెట్టిన ఆడియో మెసేజ్ వైరల్ గా మారింది. ఇక సోషల్ మీడియా మేధావులంతా లాయర్లు అయిపోయారు, జడ్జిలు అయిపోయారు. తీర్పులు ఇచ్చేస్తున్నారు. కొంతమంది తప్పంతా అమ్మాయిలదేంటారు, ఇంకొందరు వారిపై సింపతీ చూపిస్తారు. మరికొందరు సందట్లో సడేమియా అన్నట్టుగా సినిమా పాటలకు ఆ యువతులు వేసిన డ్యాన్స్ వీడియోలను తిరిగి పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. చివరిగా వారు సారీ చెప్పడంతో ఈ వ్యవహారం కాస్త పాతబడినట్టయింది. అయినా కూడా ఇప్పటికీ చిట్టి పికిల్స్ పేరుతో వేలమంది హ్యాష్ ట్యాగ్స్ ని వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చిట్టి పికిల్స్ గురించి మాట్లాడనివాళ్లు అసలు ట్రెండింగ్ టాపిక్స్ ని ఫాలో కానట్టుగా చిత్రీకరించడం విశేషం. ఐపీఎల్ కాకుండా ఈ సీజన్ లో ఇన్ని విషయాలు హైలైట్ కావడం విశేషం. చిట్టి పికిల్స్ వ్యవహారం కాస్త పాతబడుతుండటంతో.. రాబోయే రోజుల్లో మరో హాట్ టాపిక్ కోసం నెటిజన్లు వెయిట్ చేస్తున్నారు.