మన దగ్గర పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలి. కానీ, సౌత్ కొరియాలో మాత్రం టాయిలెట్ కు వెళ్తే వాళ్లే డబ్బులు తిరిగి ఇస్తారు. టాయిలెట్ కు వెళ్తే డబ్బులు ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? కానీ, నిజం. సౌత్ కొరియాలోని ఓ యూనివర్సిటీలో టాయిలెట్ వెళ్లి, అందులో ఉన్న స్కానర్ ను స్కాన్ చేస్తే నేరుగా అకౌంట్ లోకి డబ్బులు పడిపోతాయి. ఆ డబ్బులతో క్యాంపస్ లో కాఫీ తాగవచ్చు, పండ్లు, కూరగాయలు కొనవచ్చు. ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు కూడా. ఇంతకీ ఈ టాయిలెట్ కు వెళ్తే డబ్బులు ఎందుకు ఇస్తారో తెలుసా?
మలంతో విద్యుత్ తయారీ
సౌత్ కొరియాలోని ఉల్సాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (UNIST)లో అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న చో జే-వీన్ సరికొత్త టాయిలెట్ ను తయారు చేశారు. మానవ వ్యర్థాలు అయిన, మల మూత్రాల నుంచి బయోగ్యాస్ తయారు చేస్తున్నారు. ఈ గ్యాస్ ద్వారా చక్కగా వంట చేసుకోవచ్చు.
మలం నుంచి గ్యాస్ ఎలా తయారు చేస్తారంటే?
చో జే-వీన్ తయారు చేసిన టాయిలెట్ కు BV టాయిలెట్ అని పేరు పెట్టారు. BV అంటే బీ విజన్ అని అర్థం. ఈ టాయిలెట్ ద్వారా మలం వాక్యూమ్ పంప్ లోకి పంపిస్తారు. అక్కడ సూక్ష్మజీవులు వ్యర్థాలను మీథేన్ గా విచ్ఛిన్నం చేస్తాయి. నెమ్మదిగా గ్యాస్ ఒక సిలిండర్ లో నిల్వ అవుతుంది. ఆ గ్యాస్ ను ఉపయోగించి ఇంట్లో వంట చేసుకోవచ్చు. “ఇప్పుడు మానవ వ్యర్థాలను వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మలం నుంచి ఇంటికి సరిపడ గ్యాస్ ను ఉత్పత్తి చేసుకోవచ్చు. గ్యాస్ ఉత్పత్తి తర్వాత మొక్కలకు ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. ఈ టాయిలెట్ పూర్తిగా బయో టాయిలెట్ గా ఉపయోగపడుతుంది. నీటి ఉపయోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది” అన్నారు. ప్రొఫెసర్ చో జే-వీన్. ఒక వ్యక్తి మలం నుంచి సుమారు 50 లీటర్ల మీథేన్ వాయువును తయారు చేయవచ్చన్నారు. “సగటు వ్యక్తి రోజుకు 500 గ్రాముల మలవిసర్జన చేస్తారు. దానిని 50 లీటర్ల మీథేన్ గ్యాస్గా మార్చవచ్చు. ఈ వాయువు 0.5kWh విద్యుత్ను ఉత్పత్తి చేయగలదు. ఈ విద్యుత్ కారును సుమారు 1.2km (0.75 మైళ్ళు)నడపడానికి ఉపయోగించుకోవచ్చు” అన్నారు.
టాయిలెట్ కు వెళ్తే డబ్బులు వచ్చేస్తాయి!
ఈ టాయిలెట్ కు వెళ్లిన ప్రతి విద్యార్థికి చో గ్గూల్ అనే వర్చువల్ కరెన్సీ వచ్చేలా చో జే-వీన్ రూపొందించారు. ఈ టాయిలెట్ లో ఓ స్కానర్ ఏర్పాటు చేశారు. వాష్ రూమ్ కు వెళ్లిన ప్రతిసారి ఆ స్కానర్ ను స్కాన్ చేస్తే, 10 గ్గూల్ పొందే అవకాశం ఉంటుంది. ఈ డబ్బుతో విద్యార్థులు క్యాంపస్లో కాఫీ, ఇన్ స్టంట్ కప్ నూడుల్స్, పండ్లు, పుస్తకాలు కొనుక్కునే అవకాశం ఉంది. “మలం ఒకప్పుడు వృథాగా భావించే వాళ్లం. కానీ, ఇప్పుడు డబ్బులు పొందే అవకాశం కల్పిస్తోంది. టాయిలెట్ కు వెళ్లడం ద్వారా సంపాదించిన డబ్బుతో పుస్తకాల నుంచి పండ్ల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది” అంటున్నారు విద్యార్థులు.
మలంతో విమాన ఇంధనం తయారు చేసిన పరిశోధకులు
గతంలో యుకెలోని గ్లాస్టర్ షైర్ లోని ఫైర్ఫ్లై గ్రీన్ ఫ్యూయెల్స్ ల్యాబ్ లో మానవ మలం నుంచి విమాన ఇంధనాన్ని తయారు చేశారు. జేమ్స్ హైగేట్, సెర్గియో లిమా కలిసి మానవ వ్యర్థాల నుంచి కర్బన ఉద్గారాలు లేని బయో క్రూడ్ ను రూపొందించారు. బయో క్రూడ్ ను వేడి చేయడం ద్వారా బయో ఫ్యూయెల్ ఏర్పడుతుందన్నారు.
Read Also: బాబోయ్.. వీళ్లు సొంత కుటుంబ సభ్యులనే తినేస్తారట, ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా?