Big Tv Live Original: ఈ రోజుల్లో కులాలు, మతాలు ఏంటండీ? అనే వాళ్లు ఈ వార్త కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఓవైపు సమాజం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నా, ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కుల పిచ్చి కరాళనృత్యం చేస్తోంది. దళిత బహుజనులపై ఆధిపత్య కులాల అగాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడు లోని శివగంగ జిల్లాలో అత్యంత ఘోరమైన ఘటన జరిగింది.
బుల్లెట్ నడిపాడని చేతులు నరికివేత
దళిత యువకుడు బుల్లెట్ బండి నడుపుతున్నాడని తట్టుకోలేక, అగ్రవర్ణాలు అతడి చేతులు నరికిన ఘటన మేల్ పిడవూరు అనే గ్రామంలో జరిగింది. ఈ వ్యహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయ్యాసామి అనే యువకుడు శివగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన డబ్బులతో తనకు ఇష్టమైన బుల్లెట్ బైక్ ను కొనుగోలు చేశాడు. రోజూ ఆ బండి మీదే కాలేజీకి వెళ్లి వస్తున్నాడు.
అయ్యాసామిపై అగ్రవర్ణ కుర్రాళ్ల కక్ష
ఇక అయ్యాసామి బుల్లెట్ బండి మీద వెళ్లి రావడాన్ని అదే ఊరికి చెందిన కొంత మంది అగ్రవర్ణాల యువకులకు అస్సలు నచ్చలేదు. అతడి మీద కక్షగట్టారు. మా ముందే కులం తక్కువ వాడు బండి నడుపుతాడా? అంటూ కోపంతో ఊగిపోయారు. ఎప్పటి లాగే అయ్యాసామి తన బుల్లెట్ మీద కాలేజీకి వెళ్తుండగా అడ్డుకున్నారు. ఎందుకు ఆపారని ప్రశ్నించిన అయ్యాసామిపై దాడి చేశారు. “కులం తక్కువ వాడివి మా ముందే బుల్లెట్ బండి నడుపుతావా? నీ ముఖానికి బుల్లెట్ కావాల్సి వచ్చిందా?” అంటూ పిడి గుద్దులు గుద్దడం ప్రారంభించారు. వెంట తెచ్చుకున్న కత్తులతో యువకుడి చేతులను నరికారు. అక్కడి నుంచి పారిపోయారు.రక్తపు మడుగులో పడి ఉన్న అయ్యాసామిని స్థానికులు గమనించి స్థానిక హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం మధురై రాజాజీ హాస్పిటల్ లో అయ్యాసామి చికిత్స పొందుతున్నాడు. అతడి చేతులను అతికించేందుక వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.
దాడి చేసిన ముగ్గురు అప్పర్ క్యాస్ట్ నిందితుల అరెస్ట్
ఓవైపు దాడిలో గాయపడిన అయ్యాసామి హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా, మరోవైపు సదరు అగ్రవర్ణ యువకులు బాధితుడి ఇంటికి వెళ్లి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు తమ కొడుకుపై దాడి చేయడంతో పాటు ఇంటిని ధ్వంసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురు యువకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వినోద్, ఆది ఈశ్వరన్, వల్లరసులను అరెస్ట్ చేశారు. వారికి న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఈ ఘటనపై తమిళనాడు ఎస్సీ కమిషన్ సీరియస్ అయినట్లు తెలుస్తున్నది. స్థానిక పోలీసుల నుంచి ఘటనక సంబంధించిన నివేదిక కోరింది. ఈ నివేది అందిన తర్వాత తగిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
Read Also: దివికేగిన ఆ ప్రముఖులు.. కుంభమేళాలో స్నానమాచరిస్తే? పిచ్చెక్కిస్తున్న AI వీడియోలు!