మనుషు రోజు రోజు మరింత క్రూరంగా తయారవుతున్నారు. కొంత మంది అక్రమ సంబంధాల కోసం కట్టుకున్నవారిని కడతేర్చుతుంటే, కొంత మంది అనుమానంతో అత్యంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. కర్ణాటకలో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. తన దగ్గర డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తి తన భార్యతో ఫ్రెండ్లీగా మాట్లాడ్డాన్ని తట్టుకోలేక ఇద్దరినీ కొండ పైకి తీసుకెళ్లి అత్యంత కిరాతంగా దాడి చేశాడు. తనతో పాటు తన దగ్గర ఉన్న మనుషులతో వారిని ఘోరంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్నాటకలోని బాగల్ కోట్ లో ఈ దారుణం జరిగింది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తన దగ్గర గూడ్స్ వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తున్న ప్రకాశ్ అనే పాతికేళ్ల కుర్రాడు, అతడి భార్యతో ఫ్రెండ్లీగా మాట్లాడ్డాన్ని చూశాడు. కోపంతో ఊగిపోయాడు. వాళ్ల ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని అనుమానించాడు. తన దగ్గర ఉన్న మనుషులను పురమాయించి.. భార్యతో పాటు డ్రైవర్ ను కిడ్నాప్ చేయించాడు. వారిద్దరిని దగ్గరలోని కొండ మీదికి తీసుకెళ్లారు. ఇద్దరి కాళ్లు చేతులు కట్టేశారు. చేతిలో పెద్దకర్ర పట్టుకుని సదరు యజమాని డ్రైవర్ ను అత్యంత కిరాతకంగా కొట్టాడు. పక్కన ఉన్న కొంత మంది అతడి భార్యపైనా దాడి చేశారు. ఇద్దరినీ చిత్ర హింసలకు గురి చేశారు.
Read Also: రాంగ్ రూట్ లో వచ్చి.. ఆటోను ఢీకొట్టి అడ్డగోలు వాదన, కిలో మీటరు మేర ట్రాఫిక్ జామ్!
అక్కడే ఉన్న కొంత మంది ఈ తతంగాన్ని ఫోన్ లో షూట్ చేశారు. తాజాగా ఈ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. బాధితుడి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యజమానితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. వారందరినీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన కర్నాటకలో హాట్ టాపిక్ గా మారింది. అటు వీడియోను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎదుటి వ్యక్తితో మాట్లాడ్డం కూడా తప్పేనా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాళ్లే ఏవేవో ఊహించుకుని కిరాతకానికి పాల్పడుతారని మండిపడుతున్నారు.
Read Also: వర్కర్ ను బట్టలిప్పించి కొట్టిన రెస్టారెంట్ ఓనర్.. నెట్టింట వీడియో వైరల్!