పెళ్లి పందిరిలోకి ఖడ్గమృగం ప్రవేశించి నానా రచ్చ చేసిన ఘటన నేపాల్ లో జరిగింది. వివాహ వేడుక జరుగుతున్న సమయంలో ఓ భారీ ఖడ్గమృగం ఫంక్షన్ హాల్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ముందుగా నెమ్మదిగా లోపలికి వచ్చిన ఈ అడవి జంతువు.. ఆ తర్వాత నానా రచ్చ చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో పాల్గొన్న బంధువులు ప్రాణభయంతో పరుగులు తీసినట్లు స్థానికులు వెల్లడించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
చిట్వాన్ నేషనల్ పార్క్ సమీపంలో షాకింగ్ ఘటన
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన చిట్వాన్ నేషనల్ పార్క్ సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పెళ్లి వేడుకలో అందమైన పందిరి కింద వధూవరులు కూర్చుని ఉన్నారు. మేళతాళాలు మోగుతున్నాయి. అందరూ సంతోషంగా నృత్యం చేస్తున్నారు. అకస్మాత్తుగా, సమీపంలోని అడవి నుంచి ఒక ఖడ్గమృగం పెళ్లి పందిరిలోకి అడుగు పెట్టింది. దాని భారీ శరీరం, పెద్ద కొమ్ము చూసి అందరూ భయపడి పరుగులు తీశారు. వరుడు వధువును రక్షించేందుకు ప్రయత్నిస్తాడు. ఖడ్గమృగం దూసుకొచ్చి పందిరిని ధ్వంసం చేసింది. చివరకు, పెళ్లి పెద్దలు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వాళ్లు అక్కడికి చేరుకుని ఖడ్గమృగాన్ని అడవిలోకి తిరిగి పంపించారు. ఊహించని ఘటనతో వివాహ వేడుకకు వచ్చిన వాళ్లంతా భయంతో వణికిపోయారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఖడ్గమృగం పెళ్లి మండపంలోకి వెళ్తున్న వీడియోను బంధువులు షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అద్భుతంగా అలంకరించిన విద్యుత్ కాంతుల నడుమ లోపలికి అడుగు పెట్టిన ఖడ్గమృగం ఆ తర్వాత అల్లకల్లోలం సృష్టించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దాదాపు 2 మిలియన్ల వీక్షణలను పొందింది. కొంత మంది అయ్యో పాపం అంటుంటే, మరికొంత మంది ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఖడ్గమృగం రాకను కొంత మంది ‘వైల్డ్’ కార్డ్ ఎంట్రీగా అభివర్ణిస్తున్నారు. ‘సాసురల్ జెండా ఫూల్’ అని మరో నెటిజన్ బాలీవుడ్ చిత్రం ‘ఢిల్లీ 6’ లోని పాటను గుర్తు చేశారు. “ఇక ఈ పెళ్లికి వచ్చిన ఫోటోగ్రాఫర్లు ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లుగా మారారు” అని మరికొంత మంది రాసుకొచ్చారు.
చిట్వాన్ ప్రాంతంలో 600 పైగా ఖడ్గమృగాలు
నేపాల్ లో చిట్వాన్ నేషనల్ పార్క్ చాలా ఫేమస్. ఈ ప్రాంతాన్ని యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ ప్రాంతంలో సుమారు 600 పైగా ఖడ్గమృగాలు ఉన్నాయి. తరచుగా ఈ పరిసర గ్రామాల్లోకి ఇవి వస్తుంటాయి. అప్పుడప్పుడు గ్రామాల్లో విధ్వంసం సృష్టించిన సందర్భాలూ ఉన్నాయి.
పెళ్లి రిసెప్షన్ లో చిరుత పులి హల్ చల్
గత ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ లక్నోలో ఒక చిరుత పులి వివాహ వేడుకలోకి ప్రవేశించడంతో అందరూ భయంతో వణికిపోయారు. పెళ్లి జంట కారులోనే ఏకంగా 5 గంటలు ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. వెంటనే విషయంలో తెలుసుకున్న అటవీ అధికారులు, పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. సుమారు 5 గంటలపాటు శ్రమించి వేడుక జరిగే హాల్ లోని మొదటి అంతస్తులో దాక్కున్న చిరుత పులిని పట్టుకున్నారు.
Read Also: అద్భుతం.. ఈ దేశాల్లో రైళ్లు రోడ్లపైనే నడుస్తాయ్, అదెలా?