Woman fired sports shoes | ఓ 20 ఏళ్ల యువతి తొలిసారి ఉద్యోగానికి వెళ్లింది. అక్కడ ఆఫీసులో అంతా కఠిన నియమాలున్నాయి. అయితే ఈ యువతి తెలియక వాటిని పాటించలేదు. దీంతో ఆఫీసు మేనేజర్ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాడు. దీంతో ఆమె కోర్టు తలుపులు తట్టింది. తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి ఫైర్ చేశారని నష్టపరిహారం ఇప్పించాలని కోరింది. కేసు విచారణ చేసిన కోర్టు బాధితురాలికి రూ.32 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని కంపెనీ యజమాన్యానికి ఆదేశించింది. అయితే న్యాయం కోసం ఆ యువతి రెండేళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈ ఘటన యుకె (బ్రిటన్) దేశంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ దేశం సౌత్ లండన్ మాక్సిమస్ యుకె సర్వీసెస్ అనే రిక్రూట్మెంట్ ఏజెన్సీలో 2022 సంవత్సరంలో ఎలిజబెత్ బెనాస్సీ అనే 18 ఏళ్ల యువతి కొత్తగా ఉద్యోగంలో చేరింది. ఆ కంపెనీలో తనే అతి చిన్న వయస్కురాలు. అయితే ఆఫీసులో డ్రెస్ కోడ్ గురించి కఠిన నియమాలున్నాయి. తక్కువ వయసు కారణంగా ఆఫీసులో మేనేజర్ ఆమెను చిన్న పిల్లలా ట్రీట్ చేశాడని ఆమె తెలిపింది. తరుచూ ఆఫీసులో పని విషయంలో మేనేజర్ తనపై కోపంగా ఉండేవారిని చెప్పింది.
Also Read: 40 ఏళ్లుగా ఒకే భర్త నుంచి 12 సార్లు విడాకులు తీసుకున్న మహిళ.. తలలు పట్టుకున్న అధికారులు!
ఎలిజబెత్ చాలా కష్టపడి పనిచేసేది. ఆమె ఉద్యోగంలో చేరిన నెల రోజుల్లోనే పని అంతా నేర్చుకుంది. ఆఫీసులో ఆమె ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వలేదు. అయితే ఒక రోజు ఆమె డ్రెస్ కోడ్ ఉల్లంఘించిందని కారణం చూపుతూ ఆఫీసు మేనేజర్ ఆమెను సస్పెండ్ చేస్తూ తిరిగి ఇంటి పంపించేశాడు. మరుసటి రోజు ఆమెకు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఆఫీసు నుంచి ఈ మెయిల్ వచ్చింది. ఆమె ఆఫీసుకి స్పోర్ట్స్ షూస్ వేసుకొని రావడం వల్ల డ్రెస్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఆమెను ఫైర్ చేస్తున్నట్లు ఆ ఈ మెయిల్ లో ఉంది. అప్పటికి ఎలిజబెత్ ఉద్యోగంలో చేరి కేవలం మూడు నెలలు మాత్రమే గడిచాయి.
ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోవడంతో ఎలిజబెత్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆమె సౌత్ లండన్ లోని క్రోయ్ డాన్ ఎంప్లామెంట్ ట్రిబునల్ (ఉద్యోగుల కోర్టు) లో మాక్సిమస్ సర్వీసెస్ పై 2022లో కేసు వేసింది. తనను అకారణంగా ఉద్యోగంలో నుంచి తొలగించినందుకు కంపెనీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
మరోవైపు మాక్సిమస్ సర్వీసెస్ ఒక మాములు కంపెనీ కాదు. అది ప్రభుత్వ వర్క్ అండ్ పెన్షన్ విభాగానికి అవుట్ సోర్సింగ్ సర్వీసు ఇస్తోంది. దీంతో కంపెనీ కూడా తలొగ్గలేదు. కేసు విచారణ రెండేళ్ల పాటు సుదీర్ఘకాలం సాగింది. చివరికి డిసెంబర్ 2024లో ఈ కేసు విచారణలో జడ్జి ఫోర్ వెల్ ఇరువైపు వాదనలు విని తీర్పు వెలువరించారు. “ఎలిజబెత్ చాలా చిన్న వయసులో ఉద్యోగంలో చేరింది. ఆమె పనితీరు సంతృప్తికరంగా లేదని కంపెనీ ఆధారాలు చూపలేదు. పైగా ఆమె చేసిన చిన్న తప్పుకు ఉద్యోగం నుంచి తొలగించేయడం ఏమాత్రం సరికాదు. ఇతర కారణాలు ఏమైనా ఉంటే అవి కంపెనీ బహిర్గతం చేయలేదు. ఎలిజబెత్ ఆర్థిక కష్టాలకు మాక్సిమస్ సర్వీసెస్ కంపెనీనే కారణంగా నిర్ధారిస్తూ.. ఆమెకు 29,187 బ్రిటన్ పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు 32 లక్షలు) నష్టపరిహారం ఇవ్వాలి” అని జడ్జి ఫోర్వెల్ ఆదేశాలు జారీ చేశారు.