KGH: అంబులెన్స్లు సరైన సమయానికి అందుబాటులో లేక జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయిన వారి మృతదేహాలను తరలించడానికి అంబులెన్స్లు అందుబాటులో లేక కాలి నడకన, బైకులపైన మోసుకెళ్తున్నారు. ఇటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎన్నో చూశాం. తాజాగా మరో ఘటన విశాఖ కేజీహెచ్లో చోటుచేసుకుంది. బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోవడంతో బైకుపైనే ఇంటికి తీసుకెళ్లారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా ముత్యంకిపొట్టుకు చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో విశాఖ కేజీహెచ్లో జాయిన్ చేశారు. ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డ శ్వాస సంబంధిత సమస్యతో కొద్ది గంటలకే మరణించింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పాప మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బందిని అడగగా వారు అందుకు నిరాకరించారు. ఎంత ప్రాధేయపడినా అంబులెన్స్ అరేంజ్ చేయలేదు. దీంతో బైకుపైనే ఇంటికి పమయనమయ్యారు.
దాదాపు 120 కిలోమీటర్లు బైకుపైనే పాపను తీసుకొని వెళ్లారు. అయితే ఈ విషయాన్ని వైద్యాధికారి లీలా ప్రసాద్కు వారి బంధువులు తెలియజేశారు. దీంతో అతను పాడేరులో అంబులెన్స్ అరేంజ్ చేశాడు. అక్కడి నుంచి ఇంటి వరకు అంబులెన్స్లో పాప మృతదేహాన్ని తరలించారు.