North Andhra Floods: వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు కొండ వాగులు, వంకలు, నదులు పొంగుతున్నాయి. ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
గొట్టా బ్యారేజ్ క్యాచ్ మెంట్లో 33 టీఎంసీలు, తోటపల్లి పరిధిలో 11 టీఎంసీలు మేర వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. గొట్టా బ్యారేజీకి 1.89 లక్షల క్యూసెక్కులు, తోటపల్లికి 44 వేల క్యూసెక్కుల వరద వస్తోందని శ్రీకాకుళం కలెక్టర్ తెలిపారు. ఒడిశాలోని ప్రాంతాల్లో పడిన భారీ వర్షాల కారణంగా వంశధారకు 1.05 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని చెప్పారు.
భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా నలుగురు మృతి చెందినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. విశాఖ నగరం కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఒకరు మృతి చెందినట్లు చెప్పారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షం లేదని, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో నదుల్లో వరద ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల చెట్లు కూలాయని, ఇప్పటికే 90 శాతం కూలిన చెట్లను తొలగించామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు 90 శాతం మేర విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్టు ఈపీడీసీఎల్ అధికారులు తెలిపారు.
శుక్రవారం సాయంత్రం లోగా అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్ పునరుద్ధరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో ఎక్కడా జాప్యం లేకుండా చూడాలన్నారు.
గొట్టాబ్యారేజీ, తోటపల్లి వద్ద వరదనీటి ఉద్ధృతి పెరుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గొట్టా బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 68,893 క్యూసెక్కులుగా ఉందన్నారు. తోటపల్లి వరద ఇన్ ఫ్లో 30,840, ఔ ట్ ఫ్లో 14,970 క్యూసెక్కులు ఉందని ప్రకటించారు.
Also Read: AP Heavy Rains: తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ప్రజలు బయటకు రావొద్దు
శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారన్నారు. వంశధార, నాగావళి నదులకు వరద పెరుగుతుండడంతో పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.