ఏపీలో మొన్నటివరకు కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం రేపగా.. ఇప్పుడు కల్తీ పాల అంశం సర్కారును ఇరకాటంలో పెట్టింది. వాస్తవానికి నెయ్యి కల్తీ అనేది గత సర్కారు హయాంలో జరిగిందనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిలో నెయ్యి రూ.360కు కొనుగోలు చేసి తిరుమల తిరుపతి దేవస్థానంకు సరఫరా చేశారని.. తిరుమల లడ్డూ తయారీలో అదే నెయ్యి వాడారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం కల్తీ నెయ్యి అంశంపై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం మారిన ఈ వ్యవహారం ఇంకా చల్లారలేదు. తాజాగా వైసీపీ నేతలు నెయ్యి కల్తీ జరగలేదని.. చంద్రబాబు కావాలని నాడు తమ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారని అంటున్నారు.
నెయ్యి కల్తీ జరగలేదని సీబీఐ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు అదే సీబీఐ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తులో మాత్రం నెయ్యి కల్తీ జరిగిందని, అందులో జంతుఅవశేషాలు గుర్తించినట్టు ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. వీరిద్దరిలో ఎవరు చెబుతున్నది నిజం అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు.ఈ క్రమంలోనే నెయ్యిలో కల్తీ జరిగిందో లేదో తేల్చడానికి ఏపీ ప్రభుత్వం తాజాగా ఏకసభ్య కమిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆ కమిటీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టగా సర్కారు సైతం నేడు మధ్యాహ్నం జీరో అవర్ రద్దు చేసి మరి చర్చకు ఓకే చెప్పింది.
నేడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమిలోని మరికొందరు ఎమ్మెల్యేలు ఈ అంశంపై వైసీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. ఇక ఇటీవల కల్తీనెయ్యికి హెరిటెజ్కు సంబంధం ఉందంటూ చేసిన మాజీ సీఎం జగన్ ఆరోపణలు, ఆయన అనుబంధ మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, సర్కారు వేసిన ఏకసభ్య కమిషన్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు.. కమిషన్ తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టంచేసింది.
కల్తీనెయ్యి వ్యవహారంలో వైసీపీ నేతలు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి శానససభ, మండలిలో పెద్దఎత్తున నిరసనలు తెలుపుతున్నారు.సభలో చర్చలు జరగకుండా అడ్డం తగులుతున్నారు. మరోవైపు రాష్ట్రం కల్తీ పాలు తాగి నలుగురు మృతి చెందగా.. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్తీ పాల వ్యవహారంలోనూ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై కూటమి సర్కార్ తీవ్రంగా మండిపడుతోంది. రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల వ్యవహారానికి.. ప్రభుత్వానికి ఏంటి సంబంధమని ప్రశ్నించింది.ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, వరలక్ష్మి కూలింగ్ సెంటర్లో పాలు కల్తీ జరిగినట్టు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ పాలు తాగిన వారిలో యూరిన్ ఆగిపోవడం, కిడ్నీ సమస్యలు తలెత్తినట్టు కథనాలు వస్తున్నాయి. కాగా, రాష్ట్రంలో ఏదైనా దుర్ఘటన జరిగితే ప్రభుత్వాన్ని బద్నాం చేయడం వైసీపీ నేతలకు అలవాటే అని కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు.