Maoists Set Car Fire: ఏపీలో మావోయిస్టుల కదలికలు జోరందుకున్నాయా? ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాల్లో మావోలకు ఎదురుదెబ్బలు తగలడంతో ఇటు వైపు ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. చాన్నాళ్లు తర్వాత ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో మావోల కదలికలు మళ్లీ జోరందుకున్నట్లు కనిపిస్తున్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. జాతీయ రహదారిపై వెళ్తున్న కారును తగుల బెట్టారు. కారులోని ప్రయాణీకులను దించి వేసి కారుకు నిప్పు పెట్టారు. మావోయిస్టుల చర్యలను ప్రత్యక్షంగా చూసిన కారులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
తగలబడిన కారు చింతూరు నుండి భద్రాచలం వైపు వెళ్తోంది. 30వ నెంబరు జాతీయ రహదారి సరివెల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈనెల 2 నుండి 9 వరకు మావోయిస్టులు వారోత్సవాలకు పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగానే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు.
టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ మధ్యకాలంలో ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో డబుల్ రోడ్లు నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. నర్సీపట్నం నుంచి చింతపల్లి మీదుగా భద్రాచలం, అటు పాడేరు వైపు రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.
ALSO READ: జగన్.. షాక్ ఇవ్వబోతున్న ఆ నేతలెవరు?
నిర్మాణానికి ఉపయోగించే పరికరాలను మావోయిస్టులు తగలబెడుతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా కారుని తగలబెట్టడంతో విశాఖ మన్యంలో ఏం జరుగుతోందన్న టెన్షన్ నెలకొంది. లేటెస్ట్ ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు.. కూంబింగ్లో నిమగ్నమయ్యారు.