Amaravathi Padayatra : అమరావతి రైతులు పాదయాత్ర కొనసాగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పాదయాత్రను నిలుపుదల చేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది. ఐడీ కార్డులు ఉన్నవారే పాదయాత్రలో పాల్గొనాలని హైకోర్టు ఆదేశించింది. రైతులకు వెంటనే ఐడీ కార్డులు ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టం చేసింది. అమరావతి రైతులకు ప్రజలు ఏ రూపంలోనైనా సంఘీభావం తెలపవచ్చని న్యాయస్థానం పేర్కొంది.
గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాలని హైకోర్టు ధర్మాసనం మరోసారి ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించేది లేదని తేల్చిచెప్పింది. షరుతులకు లోబడే పాదయాత్ర జరగాలని స్పష్టం చేసింది. డీజీపీ ఇచ్చిన గుర్తింపు కార్డులు లేదా ఏ ఇతర గుర్తింపు కార్డునైనా పోలీసులకు చూపించాలని హైకోర్టు పేర్కొంది. తమ ఆదేశాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉల్లంఘించవద్దని స్పష్టం చేసింది. ఒకవేళ పాదయాత్రలో షరతులను ఉల్లంఘిస్తే యాత్ర రద్దు కోసం రాష్ట్ర డీజీపీ తమను ఆశ్రయించవచ్చని హైకోర్టు చెప్పింది.