ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ సాంకేతిక పటంలో అగ్రస్థానాన నిలిపేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక చారిత్రాత్మక అడుగు వేశారు. శనివారం తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ (Amaravati Quantum Valley) నిర్మాణానికి ఆయన పునాదిరాయి వేశారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి నిర్వహించిన ఈ శంకుస్థాపన కార్యక్రమం, రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో కొత్త శకానికి నాంది పలికింది.
ఈ ప్రాజెక్టు కేవలం ఏపీకే కాకుండా.. యావత్ భారతదేశానికే గర్వకారణం కానుంది. ఎందుకంటే, దేశంలోనే మొట్టమొదటి 133 క్యూబిట్ (133-Qubit) క్వాంటమ్ కంప్యూటర్కు అమరావతి వేదిక కాబోతోంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అత్యాధునిక సాంకేతికతతో ఈ వ్యాలీని తీర్చిదిద్దుతున్నారు. ప్రపంచంలోని బోస్టన్, సింగపూర్, షాంఘై వంటి ప్రసిద్ధ క్వాంటమ్ కేంద్రాలకు ధీటుగా అమరావతిని నిలబెట్టాలన్నది ప్రభుత్వ ప్రధాన సంకల్పం.
ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్, సెన్సార్స్ వంటి విభాగాల్లో పరిశోధనలు జరగనున్నాయి. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్కేర్, ఫైనాన్స్ వంటి రంగాలలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. దీనివల్ల ప్రపంచ స్థాయి పరిశోధన సంస్థలు, గ్లోబల్ టెక్ దిగ్గజాలు అమరావతి వైపు చూసే అవకాశం ఉంది. ఇది స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి దోహదపడటమే కాకుండా.. లక్షలాది మంది యువతకు అత్యాధునిక నైపుణ్య శిక్షణను అందిస్తుంది.
ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు నాటికి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, డిసెంబర్ కల్లా క్వాంటమ్ కంప్యూటర్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఐబీఎం (IBM), టీసీఎస్ (TCS), ఎల్ అండ్ టీ (L&T) వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో ఈ సెంటర్ కార్యకలాపాలు సాగనున్నాయి. భవిష్యత్తులో అమరావతి ప్రపంచానికే క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ కేంద్రంగా (Manufacturing Hub) మారుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
సామాన్యుడి జీవితంలో కూడా క్వాంటమ్ టెక్నాలజీ పెను మార్పులు తీసుకురానుంది. ముఖ్యంగా ఫార్మా రంగంలో కొత్త మందుల ఆవిష్కరణ వేగవంతం అవుతుంది. వ్యవసాయ రంగంలో వాతావరణ అంచనాలు, నీటి వినియోగం, దిగుబడి లెక్కలు మరింత కచ్చితంగా ఉంటాయి. డిజిటల్ లావాదేవీల భద్రత పెరగడం వల్ల బ్యాంకింగ్ రంగం మరింత పటిష్టం అవుతుంది.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రులు నారా లోకేశ్, నారాయణ, కందుల దుర్గేశ్, స్థానిక ఎమ్మెల్యేలు, గ్లోబల్ ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు సాకారమైతే, అమరావతి పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగడం ఖాయంగా కనిపిస్తోంది.
ALSO READ: Municipal elections 2026: త్రిముఖ పోరులో ‘హస్తం’ హుందాతనం వెనుక.. అసలు మతలబు ఇదేనా..