వైసీపీలో అరెస్ట్ ల భయం మొదలైంది. రెడ్ బుక్ ఎఫెక్ట్ అంటూ విమర్శలు చేస్తున్నా సరైన కారణాలు, సక్రమమైన కేసులతోనే వైసీపీ నేతలు, జగన్ సానుభూతి పరులు, చివరకు సాక్షి ఉద్యోగులు అరెస్ట్ కావడం విశేషం. ఈ ఎపిసోడ్ లో తాజా అరెస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు. సీనియర్ జర్నలిస్ట్ ని అందులోనూ 70 ఏళ్ల వయసున్న వారిని అరెస్ట్ చేస్తారా..? అంటూ వైసీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏకంగా జగన్ కూడా కొమ్మినేనికి మద్దతుగా ట్వీట్ చేశారు. అయితే మాజీ మంత్రి అంబటి రియాక్షన్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అంబటి ట్వీట్..
కొమ్మినేనికి మద్దతుగా అంబటి ట్వీట్ వేశారు. “కొమ్మినేని “కమ్మ” అయ్యి తనను విమర్శిస్తున్నాడని బాబు కక్ష !” అంటూ ఆయన కులం ప్రస్తావన తెచ్చారు. కమ్మకులానికి చెందిన వ్యక్తి అయి ఉండి కూడా చంద్రబాబుని కొమ్మినేని విమర్శించారని, అందుకే ఆయనపై బాబు కక్షకట్టారని, ఇప్పుడిలా జైలుకి పంపిస్తున్నారని అంటున్నారు అంబటి. అమరావతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో తప్పుడు మాటలు మాట్లాడినవారిని వారించాల్సింది పోయి ఎంకరేజ్ చేసినట్టుగా వెటకారంగా నవ్వడం, ఆ చర్చ కొనసాగించడం వల్లే కొమ్మినేనిపై కేసు నమోదైంది. ఇక్కడ కొమ్మినేని ప్లేస్ లో ఏ కులం వ్యక్తి ఉన్నా కూడా అదే జరిగేది. మరి అంబటికి కొమ్మినేని కమ్మ కులం అని గుర్తు రావడం మాత్రం విశేషం.
కొమ్మినేని "కమ్మ" అయ్యి
తనను విమర్శిస్తున్నాడని బాబు కక్ష !@ncbn @naralokesh
— Ambati Rambabu (@AmbatiRambabu) June 9, 2025
గతంలో కూడా..
ఇప్పుడే కాదు, గతంలో కూడా పలు సంఘటనల్ని కులానికి ముడిపెడుతూ అంబటి విమర్శలు చేసేవారు. ఇటీవల తనపై కేసులు నమోదయ్యాయని, అయినా తాను భయపడబోనని చెప్పేందుకు ఆయన కులాన్ని తెరపైకి తెచ్చారు. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ఘటనకు సంబంధించిన కేసుని తిరిగి తెరిచేందుకు ఇటీవల ప్రయత్నాలు జరిగాయి. కానీ చంద్రబాబు ఆ కేసు వ్యవహారంలో సీరియస్ అయ్యేసరికి ఆ కేసు ఆగిపోయింది. ఆ సమయంలో అంబటి ఓ ట్వీట్ వేశారు. కాపుల మీదే కేసులు తిరగతోడాలనుకునే వారు, నా మీద కేసులు పెట్టకుండా ఉంటారా? కేసులకు నేను భయపడాలా ? అంటూ ట్వీట్ చేశారు.
కాపుల మీదే
కేసులు తిరగతోడాలనుకునే వారు
నా మీద కేసులు పెట్టకుండా ఉంటారా?
కేసులకు నేను భయపడాలా ?@ncbn @naralokesh— Ambati Rambabu (@AmbatiRambabu) June 5, 2025
అప్పుడు కాపు, ఇప్పుడు కమ్మ..
కేసులంటే చాలు అంబటికి కులాలు గుర్తొచ్చేస్తాయి. ఇటీవల కాపులపై కేసులంటూ రాద్ధాంతం చేసిన అంబటి, ఇప్పుడు కమ్మ వర్గంపై కేసులంటూ మరోసారి కులాల ప్రస్తావన తెచ్చారు. దీంతో అంబటి ట్వీట్లపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. ఏపీలో కులాల మధ్య కుంపట్లు పెట్టడం అంబటికే చెల్లింది అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. తప్పు చేసిన వారిపై కేసులు పెడితే అక్కడ కులాల ప్రస్తావన ఎందుకని నిలదీస్తున్నారు. ఇప్పటికే కృష్ణంరాజు, కొమ్మినేనితోపాటు సజ్జలపై కూడా అమరావతి మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అంబటి కులాల ప్రస్తావన తెచ్చి అడ్డంగా బుక్కయ్యారు.
జగన్ కూడా..
ఆ మాటకొస్తే వైసీపీ అధినేత జగన్ కూడా ఇలాంటి కుల వ్యాఖ్యల్లో సిద్ధహస్తుడేనని చెప్పుకోవాలి. వల్లభనేని వంశీని జైలులో పరామర్శించి వచ్చిన తర్వాత జగన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తన కులంలో తనకంటే గొప్పగా ఎవరూ ఎదగకూడదని చంద్రబాబు అనుకుంటారని, తనకంటే అందంగా ఉన్నాడనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయించారని చెప్పారు. తన పక్కనే ఉన్న దేవినేని అవినాష్ పై కూడా అందుకే చంద్రబాబుకి కక్ష అని అన్నారు జగన్. ఏపీలో ఏ సంఘటన జరిగినా వెంటనే దానికి కులాలు ఆపాదించడం ఇటీవల సర్వ సాధారణంగా మారడం విశేషం.