Anand Mahindra Tweet: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సీఐఐ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు పెట్టుబడిదారుల కోసం ఎస్క్రో సిస్టమ్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇన్వెస్టర్లకు ఇచ్చే ప్రోత్సాహకాల కోసం ప్రత్యేకంగా ఒక విధానం అమలు చేస్తామన్నారు. ఒక ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రకటించారు. తాజాగా ఈ వీడియోను మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సీఎం చంద్రబాబు ఇటీవల సీఐఐ సదస్సులో పెట్టుబడుదారులకు ఇచ్చిన హామీలను ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు.
‘ఈ మనిషి తిరుగులేని శక్తి. దశాబ్దాలుగా నేను ఆయన గురించి వింటున్నాను. అభివృద్ధి కోసం ఆయనకు ఉన్న ఆలోచన మాత్రమే కాదు, తన విధానాలలో ఎల్లప్పుడూ నూతనంగా ఉండాలనే అతని అభిలాష. ఆయన తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రమాణాలను పెంచుతారు’ అని ఆనంద్ మహీంద్రా సీఎం చంద్రబాబు గురించి ప్రశంసించారు.
ఆనంద్ మహీంద్రా పోస్టుపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘ఆనంద్ జీ, మీ ప్రశంసనీయమైన మాటలకు ధన్యవాదాలు. భారతదేశం పరివర్తనాత్మక అభివృద్ధి దశలో ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. విధాన నిర్ణయాధికారులుగా నిరంతరం నూతన ఆవిష్కరణలు చేయడం మన బాధ్యత. ప్రజల వ్యవస్థాపక శక్తిని అన్లాక్ చేయడానికి కొత్త మార్గాలను సృష్టించేందుకు నా వంతు పాత్ర పోషిస్తున్నాను. గత కొన్ని దశాబ్దాలుగా మీ మద్దతు, భాగస్వామ్యం అమూల్యమైనవి. త్వరలో మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్కు స్వాగతించడానికి నేను ఎదురు చూస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు పోస్టు చేశారు.
విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సు విజయవంతమైందని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ హార్షం వ్యక్తం చేసింది. పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలను విడుదల చేయడానికి ‘ఎస్క్రో’ అకౌంట్ తెరవాలని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై ప్రశంసించింది. ఈ సదస్సు రాష్ట్రంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేసిందని తెలిపింది.
ఏపీలోని అన్ని ప్రాంతాలలో సమ్మిళితమైన అభివృద్ధిని ఈ సదస్తు నిర్ధారించిందని ఏపీ ఛాంబర్స్ అభిప్రాయపడింది. పెట్టుదాడుల రాకతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, స్థానిక ప్రజల ఆర్థిక వృద్ధి పెరుగుతుందని తెలిపింది. ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈలు ఏపీ పారిశ్రామిక వ్యవస్థకు వెన్నెముక అన్నారు. నిరుద్యోగాన్ని సమర్థవంతంగా పరిష్కరించడానికి, గ్రామీణాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు.
అలాగే ప్రభుత్వం చిన్న పరిశ్రమలకు ప్రధాన సవాళ్లుగా ఉన్న విద్యుత్, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడంపై దృష్టి పెట్టాలని కోరారు. ప్రోత్సాహకాల విడుదలకు ఎస్క్రో అకౌంట్ ప్రకటించడం చాలా ప్రశంసనీయమని భాస్కరరావు అన్నారు. సకాలంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందుతాయన్నారు. దీంతో పరిశ్రమలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుందన్నారు. పెండింగ్లో ఉన్న అన్ని ప్రోత్సాహక పెండింగ్ లు క్లియర్ చేయాలని ఏపీ ఛాంబర్స్ ప్రభుత్వాన్ని కోరుతోందన్నారు. అలా చేస్తే ఇప్పటికే ఉన్న పరిశ్రమల విశ్వాసాన్ని పెంచుతుందని, కొత్త పరిశ్రమలను ఆకర్షిస్తుందన్నారు.
Also Read: Nagayalanka: ఒకటి కాదు రెండు కాదు.. వందల సంఖ్యలో పాములు.. ఎక్కడంటే!
ఏపీ ఛాంబర్స్లోని అనేక మంది సభ్యులు ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్, టూరిజం & హాస్పిటాలిటీ, ఎంఎస్ఎంఈ వంటి కీలక రంగాలలో అవగాహన ఒప్పందాలపై సంతకం చేశారని భాస్కరరావు తెలిపారు. వీటిల్లో 50% కంటే ఎక్కువ సుమారు రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులుగా మారుతాయని, ఇవి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి గణనీయంగా పెంచుతాయని ఏపీ ఛాంబర్స్ అంచనా వేస్తుంది.