Ind Vs Pak: దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగాయన్నట్లు.. యుద్ధం జరిగిన ఆరు నెలల తర్వాత కూడా పాకిస్థాన్ రిపేర్లు చేస్తూనే ఉంది. ఆపరేషన్ సిందూర్తో ఇండియా కొట్టిన దెబ్బ నుంచి.. దాయాది పాకిస్థాన్ ఇప్పటికీ కోలుకోవడం లేదు. అప్పుడు జరిగిన దాడుల్లో.. భారత్ కలిగించిన నష్టాన్ని ఇప్పటికీ సెట్ చేసుకోలేకపోతోంది పాకిస్థాన్. అక్కడి ఎయిర్బేస్లపై ఇండియా చేసిన దాడులతో.. పాక్కు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఆరు నెలల తర్వాత కూడా పాకిస్థాన్లో రిపేర్లు కొనసాగుతుండటమే.. ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్గా మారింది.
6 నెలల కిందట ఆపరేషన్ సిందూర్తో ఇండియా కొట్టిన దెబ్బ ఎంత తీవ్రంగా ఉందో ప్రపంచానికి తెలిసిపోయింది. ఇండియా కాన్సట్రేట్ చేసి కొడితే ఎలా ఉంటుందో.. చుట్టుపక్కల ఉన్న చాలా దేశాలకు తెలియదు. ఇప్పుడు పాకిస్థాన్లో కనిపిస్తున్న సీన్లతో.. అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగి.. ఆరు నెలలకు పైనే అవుతోంది. అయినాసరే.. భారత దళాలు.. పాకిస్థాన్లోని తమ కీలకమైన స్థావరాలకు కలిగించిన నష్టాన్ని పాకిస్థాన్ సరిచేయలేకపోయింది. నూర్ఖాన్ ఎయిర్బేస్లో ఇప్పటికీ కొనసాగుతున్న మరమ్మత్తులు విషయం బయటకొచ్చాక.. భారత్తో జరిగిన యుద్ధంలో విజయం సాధించామని పాకిస్థాన్ చేస్తున్న వాదనలో పెద్ద బొక్కని చూపుతున్నాయ్. 4 రోజుల మినీ వార్లో.. పాకిస్థాన్లోని సైనిక, వైమానిక స్థావరాలే లక్ష్యంగా.. భారత్ దాడులు జరిపి ఆరు నెలలు గడిచింది. కానీ.. ఇస్లామాబాద్ ఇప్పటికీ ఆ నష్టాన్ని పూడ్చేందుకు, వాటిని సరిచేసేందుకు తెగ కష్టపడుతుండటం.. హాట్ టాపిక్గా మారింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో.. కిరానా హిల్స్లోని పాకిస్థాన్ న్యూక్లియర్ డిపోని.. ఇండియా ఢీకొట్టిందని మొట్టమొదటగా చెప్పిన ప్రముఖ ఓపెన్ సోర్స్ ఇంటలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమనే.. ఇప్పుడు పాకిస్థాన్ చేస్తున్న మరమ్మత్తుల గురించి బయటపెట్టాడు.
గత మే నెలలో.. భారత దళాలు టార్గెట్ చేసుకున్న ప్రదేశాల్లో ఒకటైన రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్లో.. పాకిస్థాన్ కొత్త ఫెసిలిటీ ఏర్పాటు చేయడం మొదలుపెట్టినట్లు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తోంది. నార్త్ సింధ్లోని జాకోబాబాద్ ఎయిర్బేస్లో.. భారత దాడుల్లో దెబ్బతిన్న హ్యాంగర్కి ఇప్పటికీ మరమ్మత్తులు కొనసాగుతున్నాయి. దాని పైకప్పు దశలవారీగా కూల్చేశారు. పూర్తిగా దానిని తిరిగి నిర్మించడానికి ముందు.. అంతర్గత నష్టాన్ని అంచనా వేయడానికి.. ఇలా చేశారని చెబుతున్నారు. కొన్ని నెలలుగా వచ్చిన చిత్రాల పరిశీలించగా.. ఈ విషయం తేలింది. పాకిస్థాన్ ఎప్పుడైతే.. భారత్లోని సైనిక, పౌర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న తరువాత.. ఇండియా కచ్చితమైన ఆయుధాలను ఉపయోగించి.. పాక్ లోపల 11 సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఇందులో.. రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్బేస్, ఉత్తర సింధ్లోని జాకోబాబాద్ ఎయిర్బేస్లతో పాటు మురిద్, రఫీకి, ముషాఫ్, భోలారి, ఖాద్రిమ్, సియాల్కోట్, సుక్కూర్లోని పాకిస్థాన్ వైమానిక స్థావరాలతో సహా పది సైనిక స్థావరాలపై.. భారత దళాలు దాడులు చేశాయ్. దాంతో.. పాకిస్థాన్ ఇప్పట్లో కోలుకోలేని చాలా భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
భూమి, వాయు మార్గాల ద్వారా.. పాకిస్థాన్లో భారీ నష్టాలు సంభవించాయని.. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా తెలిపారు. వీటన్నింటిలో.. నూర్ఖాన్ ఎయిర్బేస్పై భారత్ జరిపిన దాడి అతి ముఖ్యమైనది. ఎందుకంటే.. ఇది పాకిస్థాన్ అణ్వాయుధాలను మానిటర్ చేసే సంస్థ అయిన స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ హెడ్క్వార్టర్స్కి సమీపంలో ఉంటుంది. భారత దాడుల తర్వాత, ఆపరేషన్ సిందూర్ సమయంలో నూర్ ఖాన్ ఎయిర్బేస్తో సహా కీలకమైన సైనిక స్థావరాలను భారత మిసైళ్లు ఢీకొట్టాయని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు.
గత ఏప్రిల్లో పాకిస్థాన్ మద్దతుతో జరిగిన పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా.. మే నెలలో ఆపరేషన్ సిందూర్తో.. పాక్ సైనిక స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడులు కీలకమైన వైమానిక స్థావరాలు, వ్యూహాత్మక సౌకర్యాలను న్యూట్రలైజ్ చేయడమే లక్ష్యంగా జరిపారు. దాంతో.. భారత్పై పాకిస్తాన్ మరిన్ని దాడులు చేసే సామర్థ్యాన్ని కోల్పోయింది. భారత్-పాక్ మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతాల్లో వాస్తవాలను ధృవీకరించడానికి.. సైమన్ షేర్ చేసిన శాటిలైట్ చిత్రాలు కీలకంగా మారాయ్. ఆపరేషన్ సిందూర్తో ఇండియా కొట్టిన దెబ్బ నుంచి.. పాకిస్థాన్ ఇప్పటికీ కోలుకోవడం లేదనే విషయం క్లియర్గా అర్థమవుతోంది. అప్పుడు జరిగిన దాడుల్లో.. భారత్ కలిగించిన నష్టం నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతోంది దాయాది దేశం.
పాకిస్థాన్ పైకి చూపించే గాంభీర్యానికి.. ఆ దేశంలో కనిపించే గ్రౌండ్ రియాలిటీకి అస్సలు సంబంధం ఉండదని మరోసారి తేలిపోయింది. ఆపరేషన్ సిందూర్తో తమకు జరిగిన నష్టం తక్కువేనని కవర్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ.. శాటిలైట్ ఇమేజెస్.. నిజమేంటో క్లియర్గా చూపిస్తున్నాయ్. ఈ లెక్కన.. పాకిస్థాన్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనా? ఆరు నెలలుగా ఎయిర్బేస్లు, సైనిక స్థావరాల్లో రిపేర్లు ఎందుకు కొనసాగుతున్నాయ్? ఈ ఆలస్యం వెనకున్న అసలైన కారణమేంటి?
ఆపరేషన్ సిందూర్ దాడుల తర్వాత.. పాకిస్థాన్ బయటికి చెబుతున్నదానికి, అక్కడ రియాలిటీకి మధ్య ఉన్న తేడాని.. ఉపగ్రహ చిత్రాలు మరోసారి స్పష్టం చేశాయి. ఉగ్ర శిబిరాలు, ముఖ్యమైన సైనిక, వైమానిక స్థావరాలపై జరిగిన దాడుల వల్ల పాక్కు భారీ నష్టం వాటిల్లిందని తేలిపోయింది. పాకిస్థాన్ ఈ నష్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. అది కుదరలేదు. భారత దాడుల్లో తమకు జరిగిన నష్టం తక్కువేనని పాక్ చెప్పినప్పటికీ.. శాటిలైట్ పిక్చర్స్.. అందుకు విరుద్ధంగా ఉన్నాయ్. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్.. పాకిస్థాన్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్కు, అణ్వాయుధాలను పర్యవేక్షించే స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్కి సమీపంలో ఉంది.
భారత్ చేసిన దాడిలో సుమారు 7 వేల చదరపు అడుగుల మేర అక్కడున్న సౌకర్యాలు దెబ్బతిన్నాయ్. కమాండ్ అండ్ కంట్రోల్ వాహనాలుగా భావించే రెండు భారీ ట్రక్కులు కూడా ధ్వంసమయ్యాయ్. ఇక.. ఎల్వోసీ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న.. మురిద్ ఎయిర్బేస్లోనూ భారీ నష్టం వాటిల్లింది. ఇక్కడ పాకిస్థాన్ సైన్యం ప్రత్యేక ఆయుధాలని నిల్వ చేయడం, సిబ్బంది షెల్టర్ ప్రదేశంగా నిపుణులు భావిస్తున్నారు. ఇంకా.. సుక్కూర్, రహీమ్ యార్ ఖాన్, ముషాఫ్, జాకోబాబాద్, భోలారి ఎయిర్బేస్లలో.. రన్వేలపై పెద్ద గుంతలు, దెబ్బతిన్న విమానాల షెల్టర్లు, హ్యాంగర్లు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లకు నష్టం వాటిల్లింది. భారత్ చేసిన దాడుల్లో.. రహీమ్ యార్ ఖఆన్ ఎయిర్బేస్లో ఉన్న ఒకే ఒక్క రన్వేపై దాదాపు 19 అడుగుల గుంత ఏర్పడింది. ఇదంతా జరిగి ఆరు నెలలవుతున్నా.. పాకిస్థాన్ ఇప్పటికీ మరమ్మత్తులు పూర్తి చేయలేకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు.. బహవల్పూర్లోని జైషే మహ్మద్ ఆపరేషనల్ హెడ్క్వార్టర్స్ అయిన.. జామియా మసీదు సుభాన్ అల్లా పైకప్పు పగిలిపోవడం, మురిద్కేలోని లష్కరే తొయిబా ప్రధాన శిక్షణా కేంద్రం మార్కజ్ తైబాకు భారీగా నష్టం జరగడం.. శాటిలైట్ చిత్రాలతో బహిర్గతమైంది. దాడులు జరిగి ఆరు నెలలు గడుస్తున్నా.. సైనిక, వైమానిక స్థావరాల్లో ఇప్పటికీ రిపేర్లు కంటిన్యూగా జరుగుతుండటం.. పాకిస్థాన్ ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను ప్రతిబింబిస్తోంది. పాకిస్థాన్ దశాబ్దాలుగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇండియాతో 4 రోజుల పాటు యుద్ధం చేశాక.. పాక్ పరిస్థితి మరింత దరిద్రంగా తయారైంది. ఇప్పటికీ పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉండటం, ఐఎంఫ్ నుంచి అప్పుల కోసం ప్రయత్నించడం లాంటివన్నీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో.. మిగతా ప్రపంచానికి అర్థమయ్యేలా చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఆపరేషన్ సిందూర్తో భారత్ జరిపిన దాడుల్లో.. దెబ్బతిన్న ఎయిర్బేస్లు, సైనిక స్థావరాల అత్యవసర మరమ్మత్తులకు భారీగా కావాల్సిన నిధులను తక్షణమే కేటాయించడం.. పాక్ ప్రభుత్వానికి అతి పెద్ద సవాలుగా మారింది. దేశీయంగా ఇప్పటికే ఉన్న ప్రాధాన్యతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా.. ఆ దేశ రక్షణ అవసరాలకు తగినట్లుగా బడ్జెట్ సరిపోవడం లేదనే విషయం.. ఈ రిపేర్లని చూస్తే అర్థమవుతోంది.
ఇక.. దెబ్బతిన్న వైమానిక స్థావరాలు, రన్వేలను.. అత్యంత పటిష్టంగా తిరిగి నిర్మించేందుకు కావాల్సిన.. సాంకేతిక పరిజ్ఞానం, సామాగ్రి, నిపుణుల కొరత కూడా పాకిస్థాన్ని వేధిస్తోంది. ముఖ్యంగా.. విధ్వంసానికి గురైన రక్షణ పరికరాలు, ఎయిర్బేస్ మౌలిక సదుపాయాలని రిపేర్ చేసేందుకు అవసరమైన కొన్ని కీలక విడి భాగాలు, యంత్రాలు.. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులు, అంతర్జాకీయ ఆంక్షలు మరమ్మత్తులను మరింత ఆలస్యం చేస్తోంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో మరమ్మత్తులు చేపట్టేటప్పుడు భద్రతపైనా పాక్కు ఆందోళన ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. మరమ్మత్తు పనులు జరుగుతుండగానే మళ్లీ దాడులు జరిగే ప్రమాదం ఉందనే భయంతోనే.. పనులు నెమ్మదిగా చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయ్. భారత్ దాడుల తాలూకూ మిగిలిన నష్టం తీవ్రతని.. ప్రపంచానికి, పాక్ ప్రజలకు తెలియకుండా జాగ్రత్తపడటం కూడా మరో కారణం కావొచ్చంటున్నారు. నిర్మాణాలను కూల్చివేయడం, రహస్యంగా మరమ్మత్తులు చేపట్టడం లాంటివన్నీ.. నెమ్మదిగా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
Also Read: కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. సీఎం రేవంత్ రెడ్డి
ఆపరేషన్ సిందూర్లో జరిగిన నష్టం, మరమ్మతులు ఆలస్యమవడం.. పాకిస్థాన్ సైనిక సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కీలకమైన ఎయిర్బేస్లు, రన్వేలు దెబ్బతినడం వల్ల.. పాకిస్థాన్ ఎయిర్ఫోర్స్ ఆపరేషనల్ కెపాసిటీని దెబ్బతీసింది. ఇది.. దేశ రక్షణ సన్నద్ధతపై స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపుతుంది. అంతేకాదు.. మరమ్మత్తులకు అయ్యే ఖర్చు దేశ ఆర్థిక వ్యవస్థపై మరింత భారంగా మారింది. ఇతర కార్యక్రమాల నుంచి నిధులను మళ్లించాల్సి వస్తుంది. పాకిస్థాన్ పైకి బాగానే కనిపిస్తున్నా.. భారత్ దాడుల వల్ల జరిగిన నష్టం మాత్రం తీవ్రంగానే ఉందనే విషయం క్లియర్గా తెలుస్తోంది. ఇది.. అంతర్జాతీయంగా పాకిస్థాన్ విశ్వసనీయతని కూడా దెబ్బతీసింది. మొత్తంగా.. పాకిస్థాన్ చూపించే గాంభీర్యమంతా.. ఒట్టి ప్రచారమేనని, గ్రౌండ్ రియాలిటీ అందుకు భిన్నంగా ఉంటుందని లేటెస్ట్ శాటిలైట్ చిత్రాలు నిరూపించాయ్. ఈ స్థాయిలో జరిగిన విధ్వంసం, దానికి తోడు దేశ ఆర్థిక సంక్షోభం కారణంగా.. పాకిస్థాన్ తన దెబ్బతిన్న సైనిక మౌలిక సదుపాయాల నుంచి ఇప్పట్లో కోలుకోవడం కష్టమనే వాదనకు.. ఈ ఆరు నెలల ఆలస్యం.. బలాన్ని చేకూరుస్తోంది.
Story By Anup, Bigtv