Anantapur honey trap case: అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. మహిళలను ఎరగా వేసి ప్రభుత్వ అధికారులు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ఒక ముఠాను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉన్న ఈ ముఠా, అత్యంత వ్యూహాత్మకంగా బాధితులను బుట్టలో వేసుకుని బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. ఈ దందాలో అనంతపురం జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు చిక్కుకోవడం ఇప్పుడు స్థానికంగా పెను కలకలం రేపుతోంది.
ఈ ముఠా పనితీరు చాలా వినూత్నంగా సాగుతుంది. ముందుగా మహిళలు ఫోన్ ద్వారా బాధితులతో పరిచయం పెంచుకుని, సాన్నిహిత్యంగా మాటలు కలుపుతారు. ఆ తర్వాత నమ్మకం కుదిరాక ఒంటరిగా ఉన్న సమయాల్లో వారిని తమ నివాసాలకు లేదా ఏకాంత ప్రాంతాలకు పిలుస్తారు. బాధితులు ఏకాంతంగా ఉన్న సమయంలో ముఠాలోని ఇతర సభ్యులు రహస్యంగా వీడియోలు తీస్తారు. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని లేదా కుటుంబ సభ్యులకు చూపిస్తామని బాధితులను తీవ్రంగా బెదిరిస్తారు. ఒకవేళ అడిగినంత డబ్బు ఇవ్వకపోతే రేప్ కేసులు పెడతామని, మహిళా సంఘాలతో వారి ఇళ్ల ముందు ధర్నా చేయిస్తామని బ్లాక్ మెయిల్ చేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు.
బాధితుల నుంచి వచ్చిన వరుస ఫిర్యాదులతో అనంతపురం ఎస్పీ జగదీష్ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఇప్పటివరకు సుమారు 19 మంది బాధితులను గుర్తించారు. నిందితులు బాధితుల నుంచి భారీగా నగదు వసూలు చేయడమే కాకుండా, డబ్బులు ఇవ్వలేని వారి నుంచి బలవంతంగా ప్రామిసరీ నోట్లు కూడా రాయించుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన ఒక మహిళను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
అయితే, ఈ హనీ ట్రాప్ కేసులో పోలీసు శాఖకు చెందిన కొందరు అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సీరియస్ అయిన ఎస్పీ జగదీష్, శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఈ ముఠా వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. పరువు పోతుందనే భయంతో బయటకు రాని బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.
Read Also: హైదరాబాద్లో ఘోరం.. RS.17CR విలువైన డ్రగ్స్ సీజ్, నిందితుల అరెస్ట్