YSRCP Leaders: అనంతపురం నగరంలో వైసీపీ అనుచరుల హల్ చల్ చేశారు. సాయి నగర్లో నూతనంగా నిర్మించిన ప్రైవేట్ హాస్పిటల్పై దాదాపు 30 మంది రౌడీలు దాడి చేశారు. హాస్పిటల్లోని సీసీ కెమెరాలు పగలగొట్టి ఫర్నిచర్, ఏసీలు, ఐసీయు అద్దాలు, లిఫ్ట్ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటనలో దాదాపు మూడు కోట్ల రూపాయల నష్టం జరిగిందని బాధితులు తెలిపారు.
హాస్పిటల్పై దాడి చేసిన వ్యక్తుల్లో ప్రధాన నిందితుడు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు సత్యనారాయణ రెడ్డిగా గుర్తించారు. అతనితో పాటు రమణారెడ్డి, హనుమంతరెడ్డి, సాయినాథ్ రెడ్డి వంటి వ్యక్తులు హాస్పిటల్లోకి చొరబడి విధ్వంసానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
ఈ హాస్పిటల్కు యజమానులుగా శ్రీనివాసులు, రాఘవేంద్ర రెడ్డి, శ్రీలత, సత్యనారాయణ రెడ్డి ఉన్నారు. కానీ హాస్పిటల్ నిర్మాణం పూర్తికాగానే సత్యనారాయణ రెడ్డి హాస్పిటల్ను తనకే అప్పగించాలని ఒత్తిడి చేయడం మొదలైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం.. సత్యనారాయణ రెడ్డి గతంలో కూడా పలుమార్లు బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అతనికి రాజకీయ మద్దతు ఉండడంతో ఎవరూ ఎదిరించలేకపోయామని శ్రీలత వెల్లడించారు.
అప్పటి వైసీపీ మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్సీ శివరామరెడ్డి సైతం సత్యనారాయణ రెడ్డికి మద్దతుగా ఒత్తిడి చేశారని శ్రీలత సంచలన ఆరోపణలు చేశారు. హాస్పిటల్ పూర్తయ్యాక సత్యనారాయణ రెడ్డికే ఇవ్వాలని వారే చెప్పారు. తమను చంపుతానని ఎమ్మెల్సీ శివరామరెడ్డి బెదిరించాడని వేదన వ్యక్తం చేశారు బాధితురాలు లాయర్ శ్రీలత.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. హాస్పిటల్లోని ధ్వంసమైన వస్తువులను పరిశీలించి కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల్ని ధ్వంసం చేసినందున ఆధారాలు పరిమితం అయినా, సమీప ప్రాంతాల ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: 100 ఏళ్ల క్రితం ఇదే రోజు సత్యసాయి పుట్టపర్తిలో.. శతజయంతి ఉత్సవాల్లో సీఎం బాబు
అనంతపురం నగరంలో జరిగిన ఈ ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ నాయకులకు దగ్గరైన వ్యక్తులు ఇలాంటి రౌడీ తీరుకి దిగడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా వైద్య సేవల కోసం ఏర్పాటు చేసిన హాస్పిటల్ను లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.