NTR fans protest: అనంతపురం నగరం ఒకే రాత్రిలో హాట్ స్పాట్గా మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ పై దూషణలు చేశారన్న ఆరోపణలతో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో కాల్స్.. అవి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేరుతో ప్రచారం కావడంతో అభిమానుల్లో మంటలు రేగాయి. ఎప్పుడూ తమ హీరో కోసం రెడీగా ఉండే ఎన్టీఆర్ అభిమానులు ఈసారి నేరుగా ఎమ్మెల్యే ఆఫీస్ ముందు బైఠాయించి, బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న దగ్గుబాటి కార్యాలయాన్ని ముట్టడించడంతో పరిస్థితి టెన్షన్గా మారింది.
ఆఫీస్ వద్ద అభిమానుల హంగామా
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో దగ్గుబాటి ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. మా హీరోని దూషిస్తే ఊరుకోం అంటూ నినాదాలు చేశారు. అభిమానులను అడ్డుకునేందుకు పోలీసులు ముందుకొచ్చారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. “దగ్గుబాటి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి. నాలుగు గోడల మధ్య క్షమాపణలు మాకు పనికిరావు. ఎన్టీఆర్ అభిమానుల మధ్యకే రావాలి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ్లెక్సీల చింపివేత
ఇంతలో ఆఫీస్ ముందు ఉన్న దగ్గుబాటి ఫ్లెక్సీలను ఎన్టీఆర్ అభిమానులు చించివేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచింది మా ఓట్ల వల్లే. ఇప్పుడు మా హీరోని తిట్టే హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటూ అభిమానులు మండిపడ్డారు.
పోలీసుల అడ్డగింత
దగ్గుబాటి ఇంటి దగ్గర అలాగే ఆఫీస్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అభిమానులను అదుపు చేయడానికి ప్రయత్నించారు. అయితే అభిమానులు వెనక్కి తగ్గలేదు. ఆఫీస్ ముందు బైఠాయించి దగ్గుబాటి క్షమాపణ చెప్పే వరకు లేవమని డిమాండ్ చేశారు.
కార్యాలయ సిబ్బంది క్లారిటీ
ఇక ఎమ్మెల్యే ఆఫీస్ సిబ్బంది మాత్రం దగ్గుబాటి గారు ప్రస్తుతం లేరని తెలిపారు. ఇప్పుడు లేరండి.. వస్తే మీ సమస్య చెప్పండని ప్రయత్నించినా అభిమానులు వినిపించుకోలేదు. మాకు ఆయన సిబ్బంది సమాధానాలు వద్దు.. దగ్గుబాటి బయటకు వచ్చి మాట్లాడాలి అంటూ హంగామా చేశారు.
అభిమానుల డిమాండ్ స్పష్టమే
రేపు ఈవినింగ్ వరకు టైం ఇస్తాం. ఆ లోపలే మా మధ్యకి వచ్చి పబ్లిక్గా క్షమాపణ చెప్పాలి. లేకుంటే స్టేట్ వైడ్గా ఎన్టీఆర్ అభిమానులంతా దగ్గుబాటి ఇంటిని ముట్టడిస్తాం అంటూ స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు.
ఎన్టీఆర్ పాత వ్యాఖ్యలను గుర్తు చేసిన అభిమానులు
ఈ నిరసనలో అభిమానులు ఎన్టీఆర్ మాటలను గుర్తు చేశారు. తన కట్టె కాలే వరకు టీడీపీతోనే ఉంటానని ఎన్టీఆర్ గతంలో స్పష్టంగా చెప్పారు. పార్టీకి అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా నేను అందుబాటులో ఉంటానని ఆయన చెప్పారే.. మరి అలాంటి మన హీరోని ఎందుకు తిట్టారు? దగ్గుబాటి సమాధానం చెప్పాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
MLA వర్గం క్లారిటీ
ఇక మరోవైపు ఎమ్మెల్యే వర్గం మాత్రం ఆ ఆడియోలు ఫేక్ అని చెబుతోంది. దగ్గుబాటి కూడా గతంలోనే స్పష్టం చేస్తూ.. ఆ ఆడియోలు నావి కావు. ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగంగా చేస్తున్నారు. నేను మొదటి నుంచే నందమూరి కుటుంబానికి అభిమానినే. బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. అభిమానులు మనసులో నొచ్చుకున్నారనుకుంటే క్షమాపణలు చెబుతున్నా అన్నారు.
Also Read: MLA Daggubati Prasad: ఆ ఆడియో నాది కాదు.. కానీ సారీ అంటూ ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే!
కానీ అభిమానులు..
దగ్గుబాటి ఇచ్చిన క్షమాపణలు నిజాయితీగా లేవని భావిస్తూ అభిమానులు మగ్గిపోతున్నారు. నాలుగు గోడల మధ్య క్షమాపణలు కాదు. బహిరంగంగా మాట్లాడాలి. మా అభిమానుల గౌరవం దెబ్బతిన్నది.. అది సరిచేయాలంటే పబ్లిక్గానే రావాలని నిలదీస్తున్నారు.
పోలీసులు టెన్షన్లో
అభిమానులు బైఠాయించి కూర్చోవడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద ఎత్తున బలగాలు మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎటు తిరుగుతుంది ఈ వివాదం?
ఇక ఈ వ్యవహారం ఎటు తిరుగుతుందనేది పెద్ద ప్రశ్న. అభిమానులు వెనక్కి తగ్గేలా లేరు. దగ్గుబాటి కూడా ఈ వివాదంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కానీ అభిమానులు ఇంకా బహిరంగ క్షమాపణలే కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం మరింత ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.
మొత్తానికి, అనంతపురం రాజకీయ వాతావరణంలో ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం కొత్త ఉద్రిక్తతను రేపుతోంది. ఒకవైపు ఫేక్ ఆడియో వివాదం, మరోవైపు అభిమానుల బహిరంగ క్షమాపణల డిమాండ్.. ఇవి కలిపి దగ్గుబాటిని కష్టాల్లోకి నెట్టేశాయి. అభిమానుల గుండెల్లోని మంట చల్లారే వరకు ఈ వివాదం ముగిసేలా కనిపించడంలేదు.