MLA Daggubati Prasad: అనంతపురం రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. జూనియర్ ఎన్టీఆర్పై బండ బూతులు తిట్టినట్లు ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. ఆ ఆడియోలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వాయిస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. మొదట్లో మౌనం పాటించిన ఎమ్మెల్యే.. ఇప్పుడు దీనిపై అధికారికంగా స్పందించారు. ఆ ఆడియో నాది కాదు, ఇది అంతా రాజకీయ కుట్రలో భాగమే అంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా, నందమూరి కుటుంబం పట్ల తనకున్న అభిమానాన్ని ప్రస్తావిస్తూ, జూనియర్ అభిమానుల మనసుకు నచ్చుకునేలా క్షమాపణలు కూడా చెప్పారు. దీంతో ఈ ఆడియో వివాదం కొత్త మలుపు తిరిగింది.
ఆడియోలో ఏముంది?
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఆడియో హడావుడి చేస్తోంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ను బూతులు తిట్టడం, ఆయన నటించిన వార్ 2 సినిమాను ఆడనివ్వబోనని హెచ్చరించడం, నారా లోకేష్పై కామెంట్లు చేయడం వంటివి వినిపిస్తున్నాయి. ఈ ఆడియోలో ఉన్న వాయిస్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్దేనని ప్రచారం మొదలయ్యింది. దీంతో ఆడియో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది.
ఫేక్ అని ఖండించిన ఎమ్మెల్యే
అయితే తాజాగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఈ ఆరోపణలను ఖండించారు. ఆ ఆడియో కాల్స్ నావి కావు. గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో నాపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి. దాని భాగంగానే ఈ బోగస్ ఆడియోలు సృష్టించారు. ఇందులో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
నందమూరి కుటుంబం పట్ల అభిమానాన్ని వ్యక్తం చేసిన ప్రసాద్
నేను మొదటి నుంచీ నందమూరి కుటుంబానికి అభిమానిని. బాలకృష్ణ గారి సినిమాలు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా ఎంతో ఇష్టంగా చూసేవాడిని. అలాంటి నేను ఎన్టీఆర్ను దూషించడమా? ఇవన్నీ కల్పితాలని ఎమ్మెల్యే దగ్గుబాటి చెప్పారు. ఆయన స్పందనతో ఆడియోపై ప్రజల్లో మరోసారి చర్చ మొదలైంది.
జూనియర్ అభిమానులకు క్షమాపణలు
ఆ ఆడియోల వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మనసుకు నొచ్చుకుని ఉంటే.. నా వైపు నుంచి క్షమాపణ చెబుతున్నాను. ఇందులో నా ప్రమేయం లేకున్నప్పటికీ, నా పేరు ప్రస్తావించబడింది కాబట్టి నేను క్షమాపణ చెబుతున్నానని ఎమ్మెల్యే ప్రసాద్ చెప్పడం గమనార్హం. దీంతో అభిమానుల్లో కొంతమేర శాంతి నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
పోలీసులకు ఫిర్యాదు
ఈ బోగస్ ఆడియోలపై ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు కూడా ఎమ్మెల్యే వెల్లడించారు. ఖచ్చితంగా పోలీసులు విచారణ జరిపి, ఇందులో ఉన్న నిజాలు బయట పెడతారని నాకు నమ్మకం ఉంది” అని ఆయన అన్నారు. దీంతో ఈ ఆడియో వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరో త్వరలోనే బయటపడే అవకాశం ఉంది.
Also Read: AP real estate: ఏపీలో రియల్ ఎస్టేట్ హవా.. 3 నెలల్లోనే మరీ ఇంత ఆదాయమా!
రాజకీయ కుట్రేనా?
దగ్గుబాటి ప్రసాద్ మాటల ప్రకారం ఇది పూర్తిగా ఒక రాజకీయ కుట్రలో భాగమని తెలుస్తోంది. ఆయనపై గత కొన్ని నెలలుగా అనవసర ఆరోపణలు చేస్తూ వర్గ రాజకీయాలు నడుస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించడం కూడా ఆసక్తికరంగా మారింది. ఇక ప్రజల్లో ఈ విషయంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు.. ఎమ్మెల్యే నిజమే చెబుతున్నారు, ఇది పూర్తిగా ఫేక్ ఆడియో అంటుంటే, మరికొందరు నిజంగా ఆయన వాయిస్లానే ఉంది అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశం పెద్ద చర్చకు దారితీస్తోంది.
మొత్తానికి, అనంతపురం రాజకీయాల్లో హీటెక్కిన ఆడియో వివాదానికి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఆ ఆడియో నాది కాదు, ఇది రాజకీయ కుట్రే అని చెప్పడంతో పాటు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పడం ద్వారా పరిస్థితిని కూల్ చేయడానికి ప్రయత్నించారు. ఇకపై పోలీసులు ఈ కేసులో ఏం తేలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో నందమూరి కుటుంబానికి విధేయుడిననే ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతాయా అన్నది చూడాలి.
జూ.ఎన్టీఆర్ ను నేను తిట్టలేదు: దగ్గుబాటి ప్రసాద్
నేనంటే గిట్టని వారే ఫేక్ ఆడియో, వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారు
నారా, నందమూరి కుటుంబాలంటే నాకు చాలా అభిమానం
జూ.ఎన్టీఆర్ అభిమానులు అపార్థం చేసుకుని ఉంటే నన్ను క్షమించాలి
ఈ వీడియో, ఆడియోలు నావి కావు
దీనిపై గట్టి చర్యలు… https://t.co/FIg0dmuBCF pic.twitter.com/94xPuunN85
— BIG TV Breaking News (@bigtvtelugu) August 17, 2025