Leopard Tiger Attack: గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో చిరుత పులుల సంచారం, వాటి మెరుపు దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాలే కాకుండా, ఇప్పుడు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా చిరుతలు ప్రత్యక్షమవ్వడం ప్రజలను వణికిస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒక చోట పశువుల మీదో, మనుషుల మీదో దాడులు జరుగుతున్నాయనే వార్తలు వింటుంటే సామాన్యులు బయటకు రావాలంటేనే భయపడిపోయే పరిస్థితి నెలకొంది.
అనంతపురం జిల్లాలో చిరుత పులి దాడులు కలకలం రేపుతున్నాయి. స్వల్ప వ్యవధిలోనే వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులపై చిరుత పులి దాడి చేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
బుక్కరాయసముద్రం మండలంలో పొలం పనిలో ఉన్న ఆదిలక్ష్మమ్మ (60) అనే వృద్ధురాలిపై చిరుత పులి ఒక్కసారిగా విరుచుకుపడింది. ఈ దాడిలో ఆమె చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతున్నారు.
మరో ఘటనలో.. నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన కోణంకి నాయుడు అనే వ్యక్తిపై కూడా చిరుత పులి దాడి చేసింది. ఇలా వరుసగా ఇద్దరిపై దాడులు జరగడంతో శింగనమల నియోజకవర్గ పరిధిలోని గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.
పరిస్థితి తీవ్రతను గమనించిన అటవీ శాఖ అధికారులు ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేస్తూ పలు జాగ్రత్తలు సూచించారు. పొలాలకు లేదా నిర్మానుష్య ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లవద్దని, అత్యవసరమైతే తప్పనిసరిగా గుంపులుగా వెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. పొలం పనులకు వెళ్లేటప్పుడు చేతిలో కర్రలు లేదా ఇతర రక్షణ ఆయుధాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. చీకటి పడ్డాక బయట తిరగడం తగ్గించాలని, చిరుత కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.
ఉదయగిరి అటవీలో పెద్దపులి సంచారం..
నెల్లూరు జిల్లా ఉదయగిరి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. గత కొద్దిరోజులుగా ఉదయగిరి పరిసర గ్రామాల్లో పులి కనిపిస్తుండటంతో జనం వణికిపోతున్నారు. ముఖ్యంగా బండగానిపల్లి, కనుమబావి ఘాట్ రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రజలకు ఈ పులి నేరుగా తారసపడటం తీవ్ర కలకలం రేపింది.
దుత్తలూరు మండలం నందిపాడు సమీపంలో కూడా పులి ప్రత్యక్షమవ్వడంతో అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. కనుమబావి వద్ద పులి దాహం తీర్చుకుంటున్న దృశ్యాలు అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో సీపీ సజ్జనార్ తీరుపై హరీష్ రావు ఫైర్!