Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ చీఫ్ సజ్జనార్ అనుసరిస్తున్న తీరు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కోర్టు విచారణ ఇంకా కొనసాగుతుండగానే.. తీర్పు రాకముందే ఈ వ్యవహారాన్నిఇల్లీగల్ అని అధికారికంగా ప్రకటించడానికి సజ్జనార్ గారు ఏమైనా న్యాయమూర్తా అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం పోలీసుల బాధ్యత కేవలం దర్యాప్తు చేయడం మాత్రమేనని.. నేరాన్ని నిర్ధారించే అధికారం కోర్టులకు మాత్రమే ఉంటుందని గుర్తుచేశారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే ఇలాంటి నిర్ణయానికి రావడం చూస్తుంటే.. సిట్ అధికారులు ముందే ఒక రాజకీయ అజెండాతో పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోందని విమర్శించారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. కోర్టు నేరాన్ని నిర్ధారించే వరకు ఎవరినీ దోషిగా పరిగణించకూడదనే ప్రాథమిక సూత్రాన్ని సజ్జనార్ విస్మరించడం శోచనీయమని హరీష్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం , ఐటీ చట్టాల పరిధిలోకి వస్తుందని.. అందులో నిబంధనల ఉల్లంఘన జరిగిందో లేదో కోర్టులే తేల్చాలని స్పష్టం చేశారు. విచారణాధికారి హోదాలో ఉండి సామాజిక మాధ్యమాల్లో ‘ఇల్లీగల్’ అనే పదాలను వాడటం ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1968 కు విరుద్ధమని, ఇది అధికారుల నిష్పాక్షికతను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నేత పట్ల సజ్జనార్ వ్యవహరించిన తీరును హరీష్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారిని కనీస గౌరవం లేకుండా సంబోధించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ గారి పేరును ప్రస్తావించేటప్పుడు కనీస మర్యాద పాటించకపోవడం సజ్జనార్ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. పోలీసు యంత్రాంగం రాజకీయ పక్షపాతంతో వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని, దర్యాప్తు అనేది నిష్పాక్షికంగా జరగాలని డిమాండ్ చేశారు.
Also Read: అయ్యయ్యో.. ప్రియురాలి అలిగిందని పట్టాలపై తలపెట్టిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
SIT చీఫ్ సజ్జనార్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఉన్నప్పుడు 'Illegal' అని ఎలా అంటారన్న హరీశ్
ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి ఉంటుందని.. చట్టపరంగా విచారణ జరుగుతున్న సమయంలో మాజీ సీఎం కేసీఆర్ మీద సజ్జనార్ చేసిన వ్యాఖ్యలు… pic.twitter.com/1xtIdhIvuP
— BIG TV Breaking News (@bigtvtelugu) February 2, 2026