KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ‘చిట్ చాట్’లో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో జరిగిన సిట్ విచారణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 7 వేల గ్రామాల్లో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేశారని, ఈ ఘటన తమకు నాటి ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసిందని ఆయన అన్నారు. మమ్మల్ని తట్టి లేపినందుకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేసిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేయడం రావడం లేదని ధ్వజమెత్తారు. మేడారం జాతర ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలమైందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంత్రి వాహనంపైనే దాడి జరగడం శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ విచారణ అంశంపై స్పందిస్తూ, కేసీఆర్కు చట్టంపై ఉన్న గౌరవం వల్లే ఆయన విచారణకు హాజరయ్యారని, నిజానికి ఆయన రావాల్సిన అవసరం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. విచారణ పేరుతో నందినగర్ నివాసం చుట్టూ వెయ్యి మంది పోలీసులను మోహరించడం విడ్డూరంగా ఉందని, ఆ బలగాలను లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణకు ఉపయోగిస్తే సుల్తాన్ బజార్ వంటి చోట్ల పట్టపగలే ఏటీఎం దొంగతనాలు జరిగేవి కావని హితవు పలికారు. ఫోన్ ట్యాపింగ్ అసలు జరగలేదని కేసీఆర్ విచారణలో స్పష్టంగా చెప్పారని, ఈ కేసును ఒక ధారావాహిక సీరియల్లా సాగదీయకుండా ఇంతటితో ముగించాలని డిమాండ్ చేశారు. హరీష్ రావుకు ఇప్పటికే సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
ఇదే క్రమంలో పోలీస్ అధికారి సజ్జనార్పై కూడా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సజ్జనార్ జడ్జి కాదని, కేవలం ఒక పోలీస్ అధికారి మాత్రమేనని, ఫోన్ ట్యాపింగ్ అక్రమం అనుకుంటే ఆయన కోర్టుకు వెళ్లాలి తప్ప జడ్జిలా తీర్పులు చెప్పకూడదని వ్యాఖ్యానించారు. అలాగే సింగరేణి కుంభకోణం, సృజన్ రెడ్డి కాల్ డేటా వంటి అంశాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడిపై కేసు పెట్టిన సీఐ హబీబుల్లా ఖాన్ను బదిలీ చేయడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ప్రశ్నించారు. నల్లమల సాగర్ ద్వారా నీళ్ల దోపిడీ జరుగుతోందని, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ విషయంలో రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.
చివరగా మున్సిపల్ ఎన్నికలు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. తాము ఎవరిని బ్లాక్ మెయిల్ చేశామో మహేష్ గౌడ్ నిరూపించాలని సవాల్ విసిరారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏ జిల్లా నాయకత్వం ఆ జిల్లాలో పటిష్టంగా పనిచేస్తుందని, ప్రజల మద్దతు తమకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనను కేవలం పరిచయ కార్యక్రమంగానే చూస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: BRS : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎదురీత తప్పదా?