Raksha Bandhan Special Trains: రక్షాబంధన్ సమీపిస్తున్న నేపథ్యంలో రైళ్లలో రద్దీని తగ్గించేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టింది. పండుగ సమయంలో ప్రయాణికులకు అదనపు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఢిల్లీ, ప్రయాగ్రాజ్ తో పాటు ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రధాన నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. దీంతో పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు మరింత లాభం కలగనుంది.
ఉత్తర మధ్య రైల్వే ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31 వరకు ప్రయాగ్ రాజ్లోని సుబేదర్గంజ్, ఢిల్లీలోని షకుర్బస్తి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. రక్షాబంధన్ సందర్భంగా పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక రైలు నంబర్ 02275 సుబేదర్ గంజ్ నుంచి షకుర్ బస్తికి ఆగస్టు 25, 28, 30 తేదీల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 02276 షకుర్బస్తి నుంచి సుబేదర్ గంజ్ కు ఆగస్టు 26, 29, 31 తేదీల్లో ప్రయాణిస్తుంది. అదేవిధంగా రైలు నంబర్ 04147 ఆగస్టు 26న సుబేదర్గంజ్ నుంచి షకుర్బస్తికి బయలుదేరుతుంది. రైలు నంబర్ 04148 ఆగస్టు 27న షకుర్బస్తి నుంచి సుబేదర్గంజ్కు తిరుగు ప్రయాణం చేస్తుంది. మరో ప్రత్యేక సర్వీసు 04164 ఆగస్టు 28న నడపనున్నారు.
సుబేదర్గంజ్ నుంచి బయలుదేరే ప్రత్యేక రైలు ప్రయాగ్ రాజ్ ప్రాంతం నుంచి ప్రారంభమై ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రధాన స్టేషన్ల మీదుగా ఢిల్లీ వైపు ప్రయాణిస్తుంది. ఈ రైలు ఫతేపూర్, కాన్పూర్, ఇటావా, తుండ్లా, అలీగఢ్ లాంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగనుంది. ప్రస్తుత టైమ్ టేబుల్ ప్రకారం రైలు రాత్రి సుమారు 10:50 గంటలకు కాన్పూర్ సెంట్రల్కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఢిల్లీ వైపు ప్రయాణించి, మరుసటి రోజు ఉదయం సుమారు 10:15 గంటలకు షకుర్బస్తి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ప్రత్యేక రైలు షకుర్బస్తి నుంచి బయలుదేరి ఘజియాబాద్, అలీగఢ్, తుండ్లా, ఇటావా, కాన్పూర్, ఫతేపూర్ మీదుగా సుబేదర్గంజ్కు చేరుకుంటుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ప్రయాగ్రాజ్ ప్రాంతాల మధ్య ప్రయాణించే వారికి ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి.
పండుగ సమయంలో సాధారణ రైళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీనిని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లతో పాటు కొన్ని సర్వీసుల్లో అదనపు కోచ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ప్రత్యేక రైలులో ఏసీ 3-టైర్, స్లీపర్, జనరల్, పార్సెల్ కోచ్లు ఉంటాయి. ఇతర ప్రత్యేక సర్వీసుల్లో కూడా ఏసీ, స్లీపర్, జనరల్, పార్సెల్ కోచ్లను అవసరానికి అనుగుణంగా ఏర్పాటు చేయనున్నారు.
రక్షాబంధన్ సమయంలో ఢిల్లీ, కాన్పూర్, ప్రయాగ్రాజ్ వంటి ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ప్రయాణికులు ముందుగానే టికెట్ల అవైలబులిటీని పరిశీలించి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచించారు. ప్రత్యేక రైళ్ల ప్రారంభంతో పండుగ రద్దీని తగ్గించడంతో పాటు, ప్రయాణికులకు అదనపు ప్రయాణ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
Read Also: రాయగడ–గుంటూరు ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ ఛేంజ్.. ఆగస్టు 24 నుంచి కొత్త వేళలు ఇవే!