Rajampet Bandh: అన్నమయ్య జిల్లాలో నేడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజంపేటను ప్రత్యేక జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్తో జిల్లా సాధన జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) పిలుపునిచ్చిన బంద్కు రాజంపేట, రైల్వేకోడూరు పట్టణాలు స్వచ్ఛందంగా స్పందించాయి. తెల్లవారుజామున నుంచే రెండు పట్టణాల్లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది.
బంద్కు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించడంతో ఆందోళన మరింత ఉధృతమైంది. జేఏసీ నేతలు, కార్యకర్తలు రాజంపేటకు జిల్లా హక్కు ఇవ్వాలి, ప్రాంతానికి న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం కూడా వారి న్యాయమైన నిర్ణయాన్ని గౌరవించి రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
బంద్ ప్రభావంతో రాజంపేట, రైల్వేకోడూరులో ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఉదయం నుంచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇక విద్యా సంస్థలు, వ్యాపార సంఘాలు బంద్కు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాయి. పాఠశాలలు, కాలేజీలు మూతపడ్డాయి. మార్కెట్ ప్రాంతాలు పూర్తిగా వెలవెలబోయాయి.
బంద్కు అనూహ్యంగా భారీ మద్దతు లభించడంతో కడప-తిరుపతి జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిపై ఆందోళనకారులు బైఠాయించి నిరసన చేపట్టడంతో వాహనాల క్యూలు ఏర్పడ్డాయి.
జిల్లా సాధన జేఏసీ నేతలు మాట్లాడుతూ, రాజంపేటకు చారిత్రక, పరిపాలనా ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. విస్తీర్ణం, జనాభా, ఆర్థిక కార్యకలాపాల పరంగా రాజంపేట జిల్లా కేంద్రానికి అన్ని అర్హతలు కలిగి ఉందని వారు వాదించారు. జిల్లా ఏర్పాటు జరిగితే ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు పడతాయని, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని తెలిపారు.
అయితే ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టత ఇవ్వకపోవడమే ఆందోళనలకు కారణమని జేఏసీ నేతలు విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కూడా వారు ప్రకటించారు.
Also Read: పేకాట క్లబ్పై పోలీసుల దాడి.. అడ్డంగా దొరికిన 281 మంది పేకాట రాయుళ్లు
బంద్ నేపథ్యంలో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. రాజంపేట, రైల్వేకోడూరు పట్టణాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.