Eluru News: ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలోని ‘మ్యాంగో బే’ రిసార్ట్ వేదికగా సాగుతున్న భారీ పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. గత కొంతకాలంగా ఇక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న క్యాసినో తరహా కార్యకలాపాలను పక్కా సమాచారంతో పోలీసులు ఛేదించారు.
ఈ దాడుల్లో పోలీసులు ఏకంగా 281 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 35 లక్షల నగదు, 130 విలాసవంతమైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, పలువురు ‘బడాబాబులు’ ఉన్నట్లు సమాచారం. నిందితులందరినీ రికార్డుల్లో నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే వీరిని నూజివీడు కోర్టులో హాజరుపరచనున్నారు.
ఈ క్లబ్ను అత్యంత వ్యవస్థీకృతంగా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. క్లబ్ను మూడు జోన్లుగా విభజించి, ఒక్కో జోన్లో రూ. 10 వేల నుండి రూ. లక్ష వరకు బెట్టింగ్ నిర్వహించేవారు. నగదుకు బదులుగా క్యాసినో తరహాలో కాయిన్స్ను పంపిణీ చేసేవారని, ఆడేవారికి నిర్వాహకులు అక్కడికక్కడే అప్పులు కూడా ఇచ్చేవారని పోలీసులు గుర్తించారు. ఈ కేంద్రం ద్వారా రోజుకు రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు వసూళ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఉదంతంలో పోలీసులు ముగ్గురిని ప్రధాన నిందితులుగా తేల్చారు. నిర్వాహకుడు కిలారీ అప్పారావు (A1), కాట్రగడ్డ అశోక్ (A2), చోదేళ్ల లక్ష్మణ్ (A3) లపై కేసులు నమోదు చేశారు. వాస్తవానికి ఈ క్లబ్ 2011లో ప్రారంభమైంది. 2014లో పేకాట ఆరోపణలతో మూతపడగా, ఇటీవల కోర్టు అనుమతుల పేరుతో మళ్లీ తెరిచి అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు.
సోదాలు మొదలై 24 గంటలు గడుస్తున్నా.. పోలీసులు తమ వారిని బయటకు పంపడం లేదని నిందితుల బంధువులు క్లబ్ గేటు ముందు ఆందోళనకు దిగారు. మరోవైపు పట్టుబడిన వారిలో రాజకీయ పలుకుబడి ఉన్నవారు ఉండటంతో పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అటు బంధువుల ఆవేదన, ఇటు రాజకీయ ఒత్తిళ్ల మధ్య క్లబ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎవరూ లోపలికి రాకుండా పోలీసులు గేట్లు మూసివేసి భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
క్లబ్ నిర్వాహకుడి స్పందన ఇదే..
ఏలూరు జిల్లాలోని మాంగో బే రిసార్ట్ పేకాట క్లబ్పై జరిగిన పోలీసు దాడి రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. పోలీసుల ఆరోపణలను ఖండిస్తూ క్లబ్ నిర్వాహకుడు కాట్రగడ్డ అశోక్ సంచలన వివరణ ఇచ్చారు. తాము ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, అనుమతి ఉన్న స్కిల్ గేమ్ మాత్రమే ఆడుతున్నామని స్పష్టం చేశారు. నిన్న కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం వల్లే సభ్యులు అధికంగా వచ్చారు. క్లబ్ సీసీ ఫుటేజీలు నేరుగా ఎస్పీ ఆఫీసుకే కనెక్ట్ అయి ఉన్నాయి, టేబుళ్లపై డబ్బులు పెట్టి ఆడింది లేదని ఆయన వెల్లడించారు. పోలీసుల వ్యవహారశైలిని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి న్యాయపరంగా పోరాడతామన్నారు అశోక్.
ALSO READ: Shimla News: ఆస్పత్రికి వచ్చిన రోగిపై డాక్టర్ రప్పా రప్పా.. వీడియో వైరల్