Chandrababu naidu latest news(Breaking news in Andhra Pradesh) :
చంద్రబాబు టార్గెట్గా ఏపీ ప్రభుత్వం పావులు కదుపుతోందా? మరో మూడు, నాలుగు నెలలు ప్రతిపక్ష నేతను జైల్లోనే ఉంచాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్లో ఉన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయని.. చంద్రబాబు పాత్రపై విచారణ చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలైంది. దానిపై ఏసీబీ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
తాజాగా మరో కేసులో చంద్రబాబుపై సీఐడీ మరో పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో అక్రమాలు జరిగాయని పేర్కొంది. చంద్రబాబును విచారించాలంటూ A25గా ఉన్న బాబు కోసం పీటీ వారెంట్ దాఖలు చేసింది. అంతేకాకుండా అమరావతి అసైన్డ్ ల్యాండ్, రాజధాని మాస్టర్ ప్లాన్, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులో అక్రమాలపైనా విచారణ చేయాలని నిర్ణయించింది.
ఏపీలో ఎన్నికలకు 7 నెలల సమయం కూడా లేదు. ఇది ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసుకునే సమయం. ఇంత కీలక సమయంలో చంద్రబాబు జైలులో ఉండటం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బే. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ కావడానికి ముందు చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టారు. సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తమ ప్రభుత్వం హయాంలో జరిగిన పనులను వివరించారు.
అంతకుముందు బాదుడే.. బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాలను చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేశారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రతో జనానికి దగ్గరయ్యారు. తండ్రి అరెస్ట్ తర్వాత లోకేశ్ పాదయాత్రకు బ్రేక్ పడింది. ఇప్పుడు టీడీపీ నేతల ఫోకస్ అంతా చంద్రబాబు కేసుపైనే ఉంది. మరి ఈ పరిస్థితులను టీడీపీ ఎలా అధిగమిస్తుందో చూడాలి మరి.