Nawaz Sharif latest news(Telugu breaking news):
మన దాయాది దేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. తాజా ఆర్థిక సంవత్సరంలో అసలు, వడ్డీ కలిపి పాకిస్థాన్ 25 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి . పెట్రోల్ , డీజిల్ ధరలు 300 రూపాయలు దాటేశాయి. ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. ఆ పరిస్థితుల నుంచి పాక్ గట్టెక్కడం కష్టమేనని గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రకటించింది.
పాకిస్థాన్ లో తాజా పరిస్థితులపై ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ముస్లింలీగ్ పార్టీ సమావేశంలో లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్న ఆయన.. భారత్ సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. చంద్రయాన్-3 సక్సెస్ ను ప్రశంసించారు. జీ20 సమావేశాలను భారత్ నిర్వహించి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుందని కొనియాడారు. ఇదే సమయంలో పాకిస్థాన్ మాత్రం ప్రపంచ దేశాలను అడుక్కుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ ప్రధాని దేశాలు తిరుగుతూ నిధుల కోసం వేడుకొంటున్నారని తెలిపారు. భారత్ సాధించిన ఘనతను పాక్ ఎందుకు సాధించలేకపోయింది? ప్రశ్నించారు. పాక్ ఆర్థిక పతనానికి మాజీ ఆర్మీ జనరళ్లు, కొందరు న్యాయమూర్తులే కారణమని ఆరోపించారు నవాజ్ షరీఫ్.
అటల్ బిహారి వాజ్పేయీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయానికి భారత్ వద్ద కేవలం బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయని నవాజ్ షరీఫ్ వివరించారు. ప్రస్తుతం భారత్ విదేశీ మారకం విలువ 600 బిలియన్ డాలర్లుగా ఉందని వెల్లడించారు. ఇది భారత్ సాధించిన విజయమని పేర్కొన్నారు. మరి పాకిస్థాన్ ఎక్కడుందని అంటూ భావోద్వేగానికి గురయ్యారు షరీఫ్.
తన ఉద్వాసన వెనుక నలుగురు న్యాయమూర్తులు, అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా, ఐఎస్ఐ చీఫ్ జనరల్ ఫయాజ్ హమీద్ ఉన్నారని నవాజ్ షరీఫ్ ఆరోపించారు.పాక్ తాజా దుస్థితికి ఈ అధికారులే బాధ్యలని స్పష్టం చేశారు. నవాజ్ షరీఫ్కు అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో 2019 నవంబర్ లో ఏడేళ్ల జైలు శిక్ష పడింది.వైద్య కారణాలతో దేశం విడిచి వెళ్లిన ఆయన ప్రస్తుతం యూకేలో ఉంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 21న పాక్ కు తిరిగి వస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనే విజయం సాధిస్తుందని నవాజ్ షరీఫ్ విశ్వాసం వ్యక్తం చేశారు.