Amaravati: రాజధాని అమరావతిపై.. ఏపీ కూటమి ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ఇందులో భాగంగా రేపటి నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్ చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను సీఆర్డీయే అధికారులు ఇటీవల విడుదల చేశారు. మొత్తం 20వేల 494ఎకరాలను సమీకరించనున్నారు. అందులో పట్టభూమి 16వేల 562ఎకరాలు, అసైన్డ్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3వేల 828ఎకరాలని అధికారులు చెబుతున్నారు. వైకుంఠపురం, పెద్ద మద్దూరు, ఏండ్రాయి, కర్లపూడితోపాటు వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్ద పరిమి గ్రామాల్లో భూ సేకరణ చేపట్టనున్నారు. కాగా.. అమరావతి కోసం మొదటి దశలోనే 34వేల 400ఎకరాలను ప్రభుత్వం సేకరించింది.
రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీడ్ యాక్సెస్ రోడ్డును మంగళగిరి జాతీయ రహదారితో అనుసంధానించేందుకు అవసరమైన 4.5 ఎకరాల భూమి కోసం రేపు భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు.
రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం రేపటి నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఎండ్రాయి, వడ్డమాను గ్రామాల్లో పూలింగ్ పనులు మొదలవుతాయి. పూలింగ్కు ఇచ్చే గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సీఆర్డీఏను మంత్రి ఆదేశించారు.
రోడ్డు పోటు కారణంగా ఇబ్బంది పడుతున్న కమర్షియల్ ప్లాట్ దారులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. కృష్ణా రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా పీపీపీ పద్ధతిలో ఒక ఎకరా విస్తీర్ణంలో మెరినో ప్రాజెక్టుకు అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా, అడ్డంకులను తొలగిస్తూ ముందుకు సాగుతున్నామని నారాయణ స్పష్టం చేశారు.
ALSO READ: Sangareddy: సస్పెండ్ అయినా తగ్గని హాస్టల్ వార్డెన్ పొగరు.. మిత్రుడితో కలిసి విద్యార్థులపై ప్రతీకారం!