Chandrababu Powerful Speech: తాను ఏ తప్పు చేయలేదని మరోసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. తనను జైలుకి పంపినా బాధలేదని, తన కుటుంబ సభ్యుల గురించి తప్పుగా మాట్లాడితే బాధ వేసిందన్నారు. చివరకు వేధింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో ఉన్నప్పుడు 80 దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారని గుర్తు చేశారు. ఏమి చేసినా ప్రజలు రుణం తీర్చుకోలేనన్నారు.
150 రోజుల అభివృద్ది ప్రగతిపై సభలో వివరణ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ప్రజల అంచనాలను అనుగుణంగా పని చేయాలన్నారు. పగ్గాలు చేపట్టగానే ఆర్థిక పరిస్థితి చూస్తే వెంటిలేటర్పై ఉందన్నారు. కేంద్ర సహకరిస్తోందని, రాత్రికి రాత్రి ఏదీ సాధ్యం కాదన్నారు.
ఒక్కో ఇటుక పేరుస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఎంత తవ్వితే అన్ని అవకతవకలు బయటకు వస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, నేరాలు, పాపాలు ఈ ప్రభుత్వానికి సవాల్గా మారాయని చెప్పారు.
వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రం గురించి తాను, డిప్యూటీ సీఎం పవన్ అను నిత్యం కేంద్రంతో మాట్లాడుతున్నామని తెలిపారు. కేంద్రం సహకారంతో గట్టెక్కుతున్నామని వెల్లడించారు. 10 లక్షల కోట్లు అప్పులు, గాడి తప్పిన వ్యవస్థలు, అస్తవ్యస్థమైన ప్రభుత్వ శాఖలు, పెండింగ్ బిల్లులు, అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. వాటిని సరి చేసుకుంటూ వస్తున్నామని వెల్లడించారు.
సంక్షేమం అనేది టీడీపీతో మొదలైందన్నారు. కూడు, గూడు, గుడ్డ అనే కాన్సెప్ట్ టీడీపీ మొదలుపెట్టిందని గుర్తు చేశారు సీఎం. 30 రూపాయలతో ప్రారంభించిన పింఛన్ ఇప్పుడు 4000 వేలకు పెంచామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షలు మందికి ఇస్తున్నామని తెలిపారు. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసి చూస్తే దేశంలో అతి పెద్ద సంక్షేమం ఇదేనని వెల్లడించారు.
ఎన్నికల చెప్పిన ప్రతీ హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని పదేపదే చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. అమరావతికి పూర్వవైభవం తెచ్చేందుకు శ్రీకారం చుట్టామని, కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నారని తెలియజేశారు. ఈ విషయంలోనూ ప్రభుత్వం రాజీ పడేది లేదన్నారు.
పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. నిధులకు కొరత లేదని, ప్రస్తుతం 12 వేల కోట్లు విడుదల చేశారన్నారు. ప్రాజెక్టు ఎత్తు గురించి కూడా వివరణ ఇచ్చారు. 45.72 మీటర్లు ఎత్తు ఉండేలా పని చేస్తున్నామని తెలిపారు.
అలాగే రోడ్ల దుస్థితిపైనా మాట్లాడారు సీఎం చంద్రబాబు. వినూత్నమైన ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 75 వేల కోట్లతో నేషనల్ హైవే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇంకా వేల కోట్ల ప్రాజెక్టులు పనులు జరుగుతాయని వెల్లడించారు. రైల్వే గురించి కీలక విషయాలు చెప్పారు. అమరావతికి రైల్వే లైన్ కేటాయించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగ కల్పనే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ తీసుకొచ్చామని తెలిపారు. 25 పాలసీలు తీసుకొచ్చామన్నారు. ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి ఇందులో రకరకాలు పాలసీలు ఉన్నాయని వివరించారు. టూరిజం కేంద్రంగా ఉపాధి లభిస్తుందన్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగ కల్పన గురించి వివరించారు ముఖ్యమంత్రి. ఎన్టీపీసీ-జెన్ కో జాయింట్ వెంచర్ పేరిట లక్షల కోట్ల పెట్టుబడి విశాఖలో పెడుతున్నారని వివరించారు. దీన్ని ఈనెల 29 ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రిలయన్స్ బయో ఫ్యూయల్ కింద ప్లాంట్లు ఏర్పాటు అవుతున్నట్లు చెప్పుకొచ్చారు.