AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం మధ్యాహ్నానికి వాయుగుండంగా బలపడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అనంతరం 24 గంటల్లో వాయుగుండం మరింత బలపడేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
రానున్న5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గురువారం కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీవర్ష సూచన చేసింది. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని సూచించింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.