Rajahmundry Milk Tragedy: రాజమండ్రిలో చోటుచేసుకున్న కల్తీ పాల విషాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని వెల్లడించారు. కల్తీ పాల కారణంగా నలుగురు అమాయకులు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సభలో స్పష్టం చేశారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఇద్దరు బాధితులు ప్రాణాపాయ స్థితిలో ఉండి వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. మరో ఎనిమిది మంది బాధితులకు ఆస్పత్రిలో నిరంతర వైద్య పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కల్తీ పాల సరఫరాకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న పాల వ్యాపారి గణేశ్వరరావును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి వ్యక్తులను.. బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని ఆయన కఠినంగా హెచ్చరించారు.
ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని.. ప్రాథమిక ఆధారాల సేకరణలో భాగంగా 75 మంది నుంచి రక్త నమూనాలు.. పాల శాంపిల్స్ను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ పరీక్షల నివేదిక ఆధారంగా పాలల్లో ఏ విధమైన రసాయనాలు కలిశాయో ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రత.. పాల తనిఖీలను ముమ్మరం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కల్తీకి పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హామీ ఇచ్చారు.
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అనధికారిక వ్యక్తుల వద్ద పాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. మృతుల కుటుంబాలకు కేవలం ఆర్థిక సహాయమే కాకుండా.. వారి పిల్లల చదువులకు.. ఇతర అవసరాలకు కూడా సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. నిందితుల రాజకీయ నేపథ్యంతో సంబంధం లేకుండా శిక్ష పడేలా చూస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Read Also: Tirumala Ghee Case: తిరుమల లడ్డూ ఇష్యూ.. వైసీపీకి దక్కని ఊరట, స్వామి పిటిషన్ సుప్రీం కొట్టివేత